
సయోధ్య కుదిరినట్టేనా?
సాక్షి, చైన్నె: మామిడి పండు చిహ్నంగా కలిగిన పీఎంకేలో తండ్రి, తనయుల మధ్య రచ్చకెక్కిన అధికార వార్కు ముగింపు పలికే విధంగా కమలం, రెండాకులు రంగంలోకి దిగాయి. బీజేపీకి చెందిన వ్యక్తిగా ముద్రపడ్డ ఆడిటర్ గురుమూర్తి, అన్నాడీఎంకే సీనియర్లలో ఒకరైన ౖసైదె దురైస్వామి గురువారం ఉదయాన్నే తైలాపురంలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో అక్కడికి అన్బుమణి సైతం రావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్లైంది. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య బయలు దేరిన అధికార వార్ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తండ్రి, తనయుడి మధ్య అధ్యక్షుడు ఎవరో అనే విషయంగా జరుగుతున్న ఈ వివాదంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలు నలిగిపోతున్నారు. కేడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ద్విత్రీయ, తృతీయ శ్రేణి నేతలు రెండుగా చీలారు. ఈ వివాదం రోజురోజుకు చిలికి చిలికి గాలివానగా మారుతుండడాన్ని బీజేపీ, అన్నాడీఎంకే పరిగణించినట్టున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 8న మదురైకు రానున్న నేపథ్యంలో ఆలోపు తండ్రి, తనయుడి మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు చర్యలు తీసుకున్నారు. మదురై వేదికగా కూటమి కసరత్తులు, కూటమిలోకి వచ్చే పార్టీల నేతలతో సంప్రదింపునకు సన్నద్ధం అవుతున్న సమయంలో పీఎంకే నేతలను అమిత్షా ముందు కూర్చోబెట్టే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టున్నారు.
రంగంలోకి గురు, ౖసైదె..:
విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలాపురం గెస్ట్హౌస్లో గురువారం ఉదయాన్నే బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తి, అన్నాడీఎంకే సీనియర్ ౖసైదె దురైస్వామి ప్రత్యక్షమయ్యారు. ఈ ఇద్దరు మూడు గంటలపాటు రాందాసుతో సమావేశం అయ్యారు. ఆయన్ను బుజ్జగించే విధంగా, పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దుకునే విధంగా సయోధ్య ప్రయత్నాలు చేపట్టినట్టు చర్చ ఊపందుకుంది. అదేసమయంలో అన్బుమణి రాందాసు 25 రోజుల తర్వాత తైలాపురం గెస్ట్హౌస్కు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అన్బుమణితో పాటు రాందాసు పెద్దకుమార్తె గాంధిమతి కూడా రావడం గమనార్హం. గురుమూర్తి, ౖసైదెదురై స్వామి బయటకు వచ్చినానంతరం, రాందాసుతో అన్బుమని, గాంధిమతి గంటపాటు సమావేశం కావడం గమనార్హం. అయితే, సమావేశానంతరం అన్బుమణి మౌనంగా బయటకు వెళ్లడంతో చర్చల ఫలితాలపై ఆసక్తి పెరిగింది. ఇక, తాము ఓపని నిమిత్తం ఇటు వచ్చామని, తన మిత్రుడైన రాందాసును మర్యాదపూర్వకంగా కలిసినట్టు గురుమూర్తి పేర్కొన్నారు. అన్బుమణి అక్కడకు వస్తున్న విషయం తనకు తెలియదని దాట వేశారు. ఏకంగా మూడు గంటల పాటు వీరి భేటీ సాగడం చూస్తే, పీఎంకేలో నెలకొన్న పరిణామాలను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే తైలాపురానికి వచ్చి వెళ్లినట్టుగా చర్చ జరుగుతోంది. అదేసమయంలో అన్బుమణి తైలాపురానికి వచ్చి వెళ్లడంతో పార్టీలో నెలకొన్న పరిస్థితులు మరికొద్ది రోజుల్లో సరిదిద్దుకుంటాయి అనే ఆశలో పీఎంకే వర్గాలు ఉన్నాయి.
రంగంలోకి కమలం, రెండాకులు
తైలాపురంలో ఆడిటర్ గురుమూర్తి, ౖసైదె దురైస్వామి
రాందాసుకు బుజ్జగింపు
అన్బుమణి రాకతో ప్రాధాన్యం