
● నేతలతో సుదీర్ఘ చర్చ ● ఉద్వాసనలు
సాక్షి, చైన్నె: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఏమాత్రం తగ్గడం లేదు. తనయుడు అన్బుమణికి మద్దతుగా ఉన్న వాళ్లను పార్టీ నుంచి బయటకు పంపించే పనులను వేగవంతం చేశారు. తనతో కలిసి వచ్చే నేతలతో బుధవారం సుదీర్ఘ సమావేశంలో మునిగారు. పీఎంకేలో అన్బుమణి, రాందాసు మధ్య సాగుతున్న సమరం గురించి తెలిసిందే. ఎవరి బలం ఎంత అన్నట్టుగా ఇద్దరు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తనకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్లను గుర్తించిన రాందాసు పదవుల నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. తాజాగా సేలం, తిరునల్వేలి జిల్లాలకు చెందిన కార్యదర్శులు, నిర్వాహకులను తొలగించారు. దీంతో పదవులను కాపాడుకునే దిశగా కార్యదర్శులు, నేతలు రామన్న నివాసం ఉన్న తైలాపురం గెస్ట్హౌస్ వైపు పరుగులు తీస్తున్నారు. పలు జిల్లాల నుంచి బుధవారం వచ్చిన నేతలు రాందాసుతో సుదీర్ఘంగా సమాలోచనలో పడ్డారు. పార్టీ పరంగా అన్ని అధికారాలు తనకే ఉన్నాయని, అన్బుమణికి ఎలాంటి అధికారాలు లేవని రాందాసు ఈసందర్భంగా స్పష్టం చేసినట్టు తెలిసింది. తన వద్దకు ఏ మేరకు నేతలు వస్తారో, వారందరికి అభయం ఇచ్చి, మిగిలిన వారిని పార్టీ నుంచి తొలగించే విషయంలో తగ్గేది లేదన్నట్టుగా దూకుడు పెంచే దిశలో రాందాసు ఉండడం గమనార్హం.
తగ్గని రామన్న!