
ఘనంగా సత్వచ్చారి గంగమ్మ జాతర
వేలూరు: వేలూరు సత్వచ్చారిలోని గంగమ్మ జాతర బుధవారం ఉదయం కోలాహలంగా జరిగింది. ముందుగా అమ్మవారి శిరస్సును మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి శిరస్సు పూజలు నిర్వహించి పుష్ఫాలంకరణలు చేసిన రథంలో ఆశీనులు చేశారు. అనంతరం రథం ఊరేగింపుగా సత్వచ్చారిలోని పురవీధుల్లో వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అమ్మవారి రథాన్ని లాగారు. అదేవిధంగా రథంపై భక్తులు బొరుగులు, మిరియాలు చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. సంతానంలేని మహిళా భక్తులు తడిబట్టలతో వచ్చి అమ్మవారికి కర్పూర హారతులు పట్టారు. అనంతరం అమ్మవారి రథాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి ఆలయంలోని విగ్రహంపై శిరస్సును ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు పొంగుల్లు పెట్టి వివిధ వేషధారణలు ధరించి అమ్మవారికి అంబలి, పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మధ్యాహ్నం అన్నదానంతోపాటు నీరు, మజ్జిగ వంటి వాటిని అందజేశారు. అదేవిధంగా సత్వచ్చారిలోని ప్రయివేటు కల్యాణ మండపంలో వారాహి స్వామిజీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఇందులో దేవదాయశాఖ చైర్మన్ అశోకన్, వార్డు కార్పొరేటర్ మనోహరన్, భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా సత్వచ్చారి గంగమ్మ జాతర