
నిర్మాతగా రవిమోహన్
తమిళసినిమా: నటుడు రవిమోహన్కు ఇప్పుడు మంచి హిట్ చాలా అవసరం. ఆయన సక్సెస్ను చూసి చాలా కాలమైంది. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన ఇరైవన్, కాదలిక్క సైరన్, నేరమాల్లై వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ప్రస్తుతం జీనీ, పరాశక్తి చిత్రాల్లో నటిస్తున్నారు. సుధాకొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి చిత్రంలో రవిమోహన్ ప్రతినాయకుడిగా వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించిన రవిమోహన్, యోగిబాబు హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈయన నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందుకోసం సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇది ఇద్దరు హీరోల కథా చిత్రంగా ఉంటుందని, ఇందులో రవిమోహన్తో పాటు ఎస్ జే.సూర్య మరో హీరోగా నటించనున్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే వీరిద్దరూ కలిసి నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రానికి డిక్కిలోనా, వడక్కుపట్టి రామస్వామి చిత్రాల ఫేమ్ కార్తీక్ యోగి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలిసింది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవిమోహన్ అందుకోసం తనే నిర్మాతగా రంగప్రవేశం చేయనున్నారన్నమాట.