
సినీ జ్ఞాని మణిరత్నం
తమిళసినిమా: కమలహాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్లైఫ్. నటుడు శింబు, త్రిష, నాజర్ జోజు జార్జ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కమలహాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, మణిరత్నం కు చెందిన మెడ్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని, రవి కే.చంద్రన్ చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం కర్ణాటక మినహా ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలోని ఒక నక్షత్ర హోటల్లో మీడియాతో ముచ్చటించారు. కమలహాసన్ మాట్లాడుతూ తాము సినిమాలో ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామని అన్నారు. అలాంటి మరో వినూత్న ప్రయత్నమే థగ్లైఫ్ అన్నారు. నాయగన్ చిత్ర సమయంలో తాను చూసిన యువ మణిరత్నం ఇప్పుడు సినీ జ్ఞాని అని పేర్కొన్నారు. షూటింగ్లో ఒక్క క్లోజప్ షూట్ చేయడానికి 50 మంది సాంకేతిక వర్గం పనిచేస్తుందన్నారు. ఈ చిత్రంలో పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేశారని, వారి అభినందనలు పొందే విధంగా మన సాంకేతిక వర్గం పనిచేశారని కమల్ తెలిపారు. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు యూనిట్ కళ్లలో సంతోషం కనిపించిందన్నారు. అదే సంతోషం చిత్రం చూసిన తరువాత మీకు కలుగుతుందే నమ్మకం ఉందన్నారు. తనకు అండగా నిలిచిన తమిళనాడుకు ధన్యవాదాలు అని కమలహాసన్ అన్నారు. శింబు, నాజర్, అశోక్ సెల్వన్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.