
మనుషీ కోసం కోర్టుకు..
తమిళసినిమా: దర్శకుడిగా, నిర్మాతగా వెట్రిమారన్ చిత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆడుగళం చిత్రం నుంచి ఇటీవల రూపొందించిన విడుదలై–2 వరకు గమనిస్తే ఆయన చిత్రాల్లో సామాజికపరమైన అంశాలే చోటుచేసుకుంటాయి. ఆ తరహాలో దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్ రూట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం మనుషీ. ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రలో నటించిన అరమ్ చిత్రాన్ని తెరకెక్కించిన గోపినయినార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం మనుషీ. ఇదికూడా ఉమెన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందిన చిత్రమే. ఇందులో ఆండ్రియా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రం సెన్సార్ కత్తెరలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. అందుకు కారణం మనుషీ చిత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉండడమేనని సమాచారం. అంతేకాకుండా కమ్యునిస్ట్ పార్టీ లక్ష్యాలను తికమక పెట్టే విధంగా సన్నివేశాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర నిర్మాత వెట్రిమారన్ సెన్సార్ సర్టిఫికెట్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్లో సెన్సార్ బోర్డు చెప్పిన అభ్యంతక సన్నివేశాలను చిత్రం నుంచి తొలగించడానికి సిద్ధమని, చిత్రాన్ని మరోసారి సెన్సార్ చేసే విధంగా ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై త్వరలో న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా చిత్రాల సర్టిఫికెట్ కోసం దర్శక, నిర్మాతలు కోర్టును ఆశ్రయించడం అరుదైన విషయమే. అదేవిధంగా దర్శక, నిర్మాత వెట్రిమారన్ తొలిసారిగా తాను నిర్మించిన మనుషీ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.