
ఉద్యోగం పేరుతో రూ.4లక్షల మోసం
వేలూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4 లక్షలు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వేలూరు ఎస్పీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఎస్పీ మదివాణన్ అధ్యక్షతన ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతులు ఇచ్చారు. వినతులపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆయా పోలీస్స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పొయిగైలోని మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన తమిళ్సెల్వన్ ఇచ్చిన వినతిలో పేర్కొన్న విధంగా తమ ప్రాంతానికి చెందిన ఒకరు తాను వేలూరు కలెక్టరేట్లో పనిచేస్తున్నానని అతని నకిలీ గుర్తింపు కార్డును చూపించి తమకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మ బలికి గత ఫిబ్రవరిలో రూ.4 లక్షలు తీసుకున్నారని, ఇంతవరకు ఉద్యోగం ఇప్పించలేదన్నారు. విచారణ జరిపి తాము చెల్లించిన నగదును తిరిగి ఇప్పించాలని కోరారు. అదేవిధంగా వేలూరు ప్రజా సంక్షేమ సంఘం ప్రతినిధి జగదీశన్ ఇచ్చిన వినతిలో పేర్కొన్న విధంగా ఊసూరు, అనకట్టు ప్రాంతంలో రాత్రుల్లో కొంతమంది యువకులు ఆటో, బైకుల్లో రేసింగ్ చేస్తున్నారన్నారు. వినతులను స్వీకరించిన ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. డీఎస్పీ సుందరేశన్, పోలీసులు పాల్గొన్నారు.