
తండ్రి మరణ వార్త తెలియకముందే..
● అప్పుల బాధతో కుమారుడు ఆత్మహత్య
సేలం: నామక్కల్– తిరుచెంగోడ్లో అప్పులు చేసి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన మెడికల్ ఏజెన్సీ యజమాని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి మరణ వార్తను తెలియజేయడానికి ప్రయత్నిస్తుండగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్లోని నిరాశ్రయులైన కాలనీలో నివసిస్తున్న గోవిందన్ (68) కు భార్య పూంగోడి, కుమార్తె కీర్తిక, కుమారుడు బాలమురుగన్ (36) ఉన్నారు. ఇద్దరూ వివాహితులు. గోవిందన్ దంపతులు కుమారుడితో నివసిస్తున్నారు. గోవిందన్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి తండ్రి మరణవార్తను తెలియజేయడానికి పళనికి వెళ్లిన బాలమురుగన్కు బంధువులు ఫోన్ చేయగా, అతను ఫోన్ తీయలేదు. అనుమానం వచ్చిన బంధువులు సంగకిరి రోడ్డులోని బాలమురుగన్ మెడికల్ ఏజెన్సీ దుకాణానికి వెళ్లి చూడగా దుకాణం లోపలి నుంచి తాళం వేసి ఉంది. తలుపు పగులగొట్టి చూడగా బాలమురుగన్ నోటి నుంచి నురగలు కారుతూ చనిపోయి కనిపించాడు. ఆన్న్లైన్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో అతను రుణం తిరిగి చెల్లించలేకపోయాడని చెబుతున్నారు. అప్పుల బాద భరించలేక బాలమురుగన్ పళనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. దుకాణంలోని విషపూరిత మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం తిరుచెంగోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. ఒకే కుటుంబంలో అప్పుల సమస్యల కారణంగా తండ్రి గుండెపోటుతో మరణించగా, కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆత్మహత్య చేసుకున్న బాలమురుగన్కు భార్య తమిళరసి, ఏడేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి మరణ వార్త తెలియకముందే..