
ఉపాధ్యాయులతో కలెక్టర్ చర్చలు సఫలం
● ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటన
తిరువళ్లూరు: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసే సమయంలో తిరుత్తణిలో ఉపాధ్యాయులను కించ పరిచేలా కలెక్టర్ వ్యవహరించారని ఆరోపిస్తూ గత రెండు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులతో కలెక్టర్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన నిర్వహించాలని ప్రకటించిన ఉపాధ్యాయులు ఆందోళన వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఉపాద్యాయుల ఆందోళన హెచ్చరిక తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన సీఈఓ మోహన జోక్యం చేసుకుని కలెక్టర్తో చర్చలకు ఉపాధ్యాయులను ఆహ్వానించారు. ఈ చర్చలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై 8.30 గంటల వరకు జరిగాయి. ఉపాధ్యాయుల వివరణ విన్న కలెక్టర్ సైతం సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ భవిషత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు ఉపాధ్యాయ సంఘాలకు వివరించారు. కలెక్టర్ ప్రతాప్ విచారం వ్యక్తం చేసిన క్రమంలో సోమవారం నుంచి పిలుపునిచ్చిన ఆందోళనను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.