
మార్చురీలో మృతదేహం మాయం
తిరువళ్లూరు: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించాలని మార్చురీలో వుంచిన క్రమంలో బుధవారం వృద్ధుడి మృతదేహం అదృశ్యమైంది. తిరువళ్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రాజేంద్రన్(61). ఇతను కడుపునొప్పి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తిరువళ్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేంద్రన్ మృతి చెందాడు. మృతదేహానికి పంచనామ నిర్వహించాల్సిన క్రమంలో బాధితులు పోలీస్స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని రావడానికి మంగళవారం వెళ్లారు. అక్కడ అనుమతి కాపీ తీసుకుని బుధవారం మధ్యాహ్నం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. అక్కడ రాజేంద్రన్ మృతదేహానికి బదులు వేరే వ్యక్తి మృతదేహాన్ని బంధువులకు అప్పగించి తీసుకెళ్లాలని కోరారు. దీంతో రాజేంద్రన్ బంధువులు షాక్కు గురైయ్యారు. సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మార్చురీ వద్ద ఆందోళన చేశారు. పోలీసుల దర్యాప్తులో రెండు రోజుల క్రితం వెంగళ్ సమీపంలో ఎల్అండ్టీ సంస్థ రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న బిహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందిన మనోజ్ మంజీ(55) అనారోగ్యంతో మృతి చెందినట్టు గుర్తించారు. అతడి మృతదేహాన్ని సైతం మార్చురీలో వుంచిన క్రమంలో శవపరీక్ష నిర్వహించిన తరువాత రాజేంద్రన్ మృతదేహాన్ని మంజీగా భావించి బిహార్కు తరలించినట్టు నిర్ధారించారు. వెంటనే నాగపూర్ వద్ద వెళుతున్న వాహనాన్ని వెనుక్కి తీసుకుని రావాలని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మృతదేహం తిరువళ్లూరుకు చేరే అవకాశం వుందని పోలీసులు తెలిపారు. పోలీసుల హామీతో బంధువులు ఆందోళననూ విరమించారు.
మృతదేహాన్ని మార్చి బిహార్కు తరలింపు
సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో కలకలం

మార్చురీలో మృతదేహం మాయం