
కమలహాసన్ ఒంటరయ్యారా?
తమిళసినిమా: నటుడు కమలహాసన్కు సమస్యలు కొత్తేమీ కాదు. ఇంతకుముందు చాలా సమస్యలను ఎదురొడ్డి పోరాడి గెలిచారు. ముఖ్యంగా విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో పెద్ద పోరాటమే చేశారు. ఆ సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన కమలహాసన్ తాను వేరే దేశానికి వెళ్లిపోతాను అని చెప్పారు. తాజాగా ఆయన మరో సమస్యను ఎదుర్కొంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్లైఫ్. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇటీవల బెంగళూరులో తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కన్నడ భాష సంఘాలు కమలహాసన్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే థగ్లైఫ్ చిత్ర విడుదలను కర్ణాటకలో అడ్డుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయ నేతలు కమలహాసన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. దీంతో కమలహాసన్ కర్ణాటక రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. విశేషం ఏమిటంటే అక్కడ న్యాయమూర్తి కన్నడ ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కమలహాసన్కు క్షమాపణ చెప్పడానికి ఈగో ఎందుకు అని ప్రశ్నించడం గమనార్హం. కమలహాసన్ దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి ద్వారా తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే విధంగా లేఖను కోర్టుకు పంపించారు. అయినప్పటికీ న్యాయస్థానం ఆ లేఖను పరిగణనలోకి తీసుకోకుండా క్షమాపణ చెప్పేవరకు థగ్లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదలను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో తమిళనాడులో కమలహాసన్కు నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, తమిళం వాళ్ ఉరిమై పార్టీ నేత వేల్ మురుగన్, విడుదలై చిరుతైగళ్ పార్టీ నేత తోల్ తిరుమావళవన్ మద్దతుగా నిలిచారు. ఈ ముగ్గురు మినహా ఇతర పార్టీ నేతలు, సినీ ప్రముఖులు మౌనం వహించడం గమనార్హం. ఇకపోతే కర్ణాటకలో విడుదల కాకపోతే థగ్లైఫ్ చిత్రం రూ.70 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి. అయినప్పటికీ భాషపై అభిమానం, తాను తప్పు చేయలేదన్న భావన కారణంగా డబ్బును వదులు కోవడానికే కమలహాసన్ సిద్ధపడుతున్నారు. దీంతో పలువురు ఆయన్ని అభినందిస్తున్నారు. అయితే తమిళ భాష విషయంలో కమలహాసన్ ఒంటరి అయ్యారా అనే చర్చ సినీ, రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇకపోతే థగ్లైఫ్ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆటల ప్రదర్శనకు అనుమతినిచ్చింది. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు రోజుకు 6 ఆటల ప్రదర్శనకు అనుమతినిచ్చింది.