
వారు మాస్కులు ధరించాలి
సాక్షి, చైన్నె : గర్భిణులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, పౌష్టికాహర లోపంతో బాధపడుతున్న వారు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తే మంచిదని ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ సూచించారు. ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలని, అయితే, ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ నేతృత్వంలో బుధవారం జరిగిన పల్మనరీ డిసీజ్, ఫ్యాటీ లివర్ వ్యాధి అవగాహన కార్యక్రమంలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య మంత్రి ఎంసుబ్రమణియన్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కేసుల్లో మరణం అన్నది లేదని, త్వరితగతిన కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మరణించిన వారికి ఇతర సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని, జ్వరం వంటి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గర్భిణులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు, పౌష్టికాహార లోపం ఉన్న వారు ఇంటి నుంచి జన సంచార ప్రాంతాలకు వస్తే మాస్కులు ధరించడం మంచిదని సూచించారు. అలాగని అందర్నీ మాస్కులు ధరించమని ఆదేశించడం లేదన్నారు. కాగా, కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో మాస్కులను ధరించే విషయంగా విద్యామంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ సమాచారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, వారు ఇచ్చే సూచనలకు అనుగుణంగా అవశ్యమైతే విద్యార్థులకు మాస్కులు తప్పని సరి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.