
ఆ ఇద్దరి కాంబో రిపీట్
పాండిరాజ్, విజయ్సేతుపతి
తమిళసినిమా: కథలను నమ్మి చిత్రాలు చేసే దర్శకుడు పాండిరాజ్. ఈయన ఇంతకుముందు పసంగ, కడైకుట్టిసింగం, నమ్మవీట్టు పిళ్లై వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. చివరిగా ఈయన సూర్య హీరోగా నటించిన ఎదర్కుక్కుమ్ తునిందవన్ చిత్రాన్ని చేశారు. ప్రస్తుతం విజయ్సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన తలైవన్ తలైవి చిత్రాన్ని తెరకెక్కించారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం పైమంచి అంచనాలే నెలకొన్నాయి. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్రం విడుదలకు ముందే విజయ్సేతుపతి, దర్శకుడు పాండిరాజ్ కాంబినేషన్ రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. నటుడు విజయ్ తాజాగా కథానాయకుడిగా నటించిన ఏస్ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. కాగా మిష్కిన్ దర్శకత్వంలో ఈయన నటించిన ట్రైన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఇప్పటివరకు తెలుగులో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన విజయ్సేతుపతి తాజాగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తుండడం విశేషం.