
స్వాధీనం చేసుకున్న బైకుల వేలం
వేలూరు: వేలూరు జిల్లాలో సారా కేసుల్లో స్వాధీనం చేసుకున్న 38 బైకులకు గురువారం ఉదయం వేలూరు నేతాజీ స్టేడియంలో వేలం నిర్వహించారు. వేలూరు ఎస్పీ మదివాణన్, అదనపు ఎస్పీ భాస్కరన్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. వేలం పాడేందుకు అధిక సంఖ్యలో కొనుగోలు దారులు, వ్యాపారులు రావడంతో పోలీసులు రూ.100 టోకెన్లు విక్రయించారు. టోకెన్లు కొనుగోలు చేసిన వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించారు. ప్రతి వాహనాన్ని కొనుగోలు దారులు పోటీ పడి వేలం పాడడంతో బైకులు అధిక ధర పలికాయి. వేలూరు జిల్లా పేర్నంబట్టుకు చెందిన దివ్య తన కుమార్తె కోసం గత ఆరు నెలల క్రితం రూ.1.20 లక్షలతో కొత్త బైకును కొనుగోలు చేసింది. అయితే గత మూడు నెలల క్రితం దివ్య బంధువు ఒకరు బైకును తీసుకెళ్లి సారాను తరలించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బైకును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ బైకు వేలం వేస్తున్నారని తెలుసుకున్న దివ్య తన వద్ద ఉన్న లైసెన్స్, పత్రాలను చూపించి తన బైకును తనకే ఇవ్వాలని ఎస్పీ మదివాణన్ వద్ద విన్నవించింది. అయినప్పటికీ పోలీసులు వేలం వేయడంతో ఆమె బైకును రూ.94 వేలం పాట ద్వారా కొనుగోలు చేసింది.