
రైతుల చెంతకు అధికారులు
తిరువళ్లూరు: రైతుల సమస్యల పరిష్కారం, గిట్టుబాటు ధర, పంటల సాగుపై రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తారు. ప్రతినెలా రెండు రోజులపాటు తాలుకా పరిధిలోని ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల వద్దకు వ్యవసాయ సంక్షేమశాఖ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఇందులోభాగంగా పథకానికి రూపకల్పన చేసిన క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి స్టాలిన్ పథకాన్ని ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లియూరులో రైతుల వద్దకు వ్యవసాయశాఖ ఽఅధికారులు అనే కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి హాజరయ్యారు. వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్యకార, పశుసంవర్థఽక, సహకార శాఖతోపాటు వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన తాలుకా పరిధిలో ప్రతి నెలా రెండవ, నాల్గవ శుక్రవారాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఏడాది లోపు 770 గ్రామాల్లో రైతుల వద్దకు వ్యవసాయ సంక్షేమశాఖ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులకు పంటల సాగు, ఎరువుల వాడకం, గిట్టుబాటు ధర, చేపల పెంపకం, వ్యవసాయ రుణాల సద్వినియోగంపై అవగాహన కల్పిస్తామని కలెక్టర్ వివరించారు. రైతులు తాము పండించిన పంటలను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. అనంతరం రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కళాదేవి, సహకార సంఘాల జాయింట్ రిజిస్ట్రార్ షణ్ముగవళ్లి, తిరుత్తణి సహకార చక్కెర ఫ్యాక్టరీ కార్యదర్శి మోహన్ పాల్గొన్నారు.