
మా అమ్మాయి కథానాయకి అవుతోంది!
తమిళసినిమా: కోలీవుడ్లో బోల్డ్ అండ్ డేరింగ్ నటి ఎవరైనా ఉన్నారంటే అది వనితా విజయ్కుమార్నే అవుతారు. ధైర్యానికి మారు పేరు ఈమె అని అనవచ్చు. వివాదాస్పద నటిగానూ ముద్ర వేసుకున్నారు. కాగా తాజాగా వనితా విజయ్కుమార్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి కథానాయకిగా నటించిన చిత్రం మిసెస్ అండ్ మిస్టర్. నృత్య దర్శకుడు రాబర్ట్ కథానాయకుడిగా నటించిన ఇందులో సిమ్రాన్, షకీలా, సెఫ్ దాము,ఆర్తీగణేశ్, పవర్స్టార్ శ్రీనివాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకాంత్దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్రాన్ని నటి వనితా విజయ్కుమార్ వారసురాలు జోవికా విజయ్కుమార్ వనితా ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించడం విశేషం. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ముందుగా వనితా విజయ్కుమార్, ఆమె కూతురు జోవిక విజయ్కుమార్లో లక్ష్మీ కుబేర పూజను నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో నటి వనితా విజయ్కుమార్, జోవిక విజయ్కుమార్తో పాటూ షకీలా, అంబికా, పాతిమాబాబు, పవర్స్టార్ శ్రీనివాసన్, ఆర్తి గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై పాల్గొన్ప అతిథులు నటి వనితా విజయ్కుమార్ ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఒంటరి మహిళగా ఆమె ఎదురోడ్డి నిలిచి విషయాలను ప్రస్తావించారు. నటి ,చిత్ర దర్శకురాలు వనితా విజయ్కుమార్ మాట్లాడుతూ తన కూతురు జోవిక విజయ్కుమార్ తండ్రి ఎవరని చాలా మంది అడుగుతున్నారని, తాను వివాహనంతరం ఎదుర్కొన్న సమస్య గురించి ఇప్పుడు ప్రస్తావించదలచుకోలేదని, అయితే తాను మూడు నెలల గర్భిణిగా ఉన్న తరుణంలో తన తండ్రి విజయ్కుమార్ ధైర్యం చెప్పి అమెరికాకు పంపారని చెప్పారు. అక్కడే జోవిక పుట్టిందన్నారు. ఇకపోతే నటి కూతురు జోవిక బిగ్బాస్ రియాలిటీ గేమ్షోలో పాల్గొని సంపాదించిన డబ్బుతోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ను అధిక భాగం మలేషియాలో నిర్వహించినట్లు చెప్పారు. ఇది మంచి ఎంటర్టెయినర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కాగా జోవిక విజయ్కుమార్ త్వరలోనే హీరోయిన్ కానున్నారని, తను ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలను కమిట్ అయ్యినట్లు చెప్పారు.