
పేరు మోసిన దొంగ అరెస్టు
సేలం: జిల్లాలోని ఓమలూరుకు చెందిన పేరు మోసిన దొంగ నరేష్(26)ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కాల్పులు జరపగా అతడి కాలికి తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన నరేష్పై 17 చోరీ కేసులతో పాటు హత్య, దోపిడీ కేసులున్నాయి. ఒంటరి వృద్ధులను టార్గెట్ చేసి, చోరీలకు పాల్పడుతూ వచ్చాడు. ఈనెల 20న సేలం తీవట్టి పట్టి ప్రాంతంలో ఒక వృద్ధరాలిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న నగలు అపహరించుకెళ్లాడు. ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శనివారం సంఖగిరి సమీపంలోని కొండ ప్రాంతంలో నరేష్ తలదాచుకుని ఉన్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అతడిని చుట్టుముట్టడంతో వారిపై దాడి చేశాడు. దీంతో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ విజయరాఘవన్, కానిస్టేబుల్ సెల్వకుమార్కు కత్తిపోట్లు అయ్యాయి. ఇన్స్పెక్టర్ సెంథిల్కుమార్, నరేష్ కుడికాలుపై కాల్చాడు. దీంతో నేలపై పడిన అతడిని పోలీసులు అరెస్టు చేశారు. సంఖగిరి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సమాచారం అందుకున్న సేలం ఎస్పీ రాజేష్కన్నన్, డీఐజీ ఉమా సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.
ట్రక్కు ఢీకొని చిన్నారి మృతి
అన్నానగర్: కృష్ణగిరి జిల్లా ఉత్తనపల్లి సమీపంలోని ఆలే సీపం గాంధీ నగర్కి చెందిన అజిత్ ఆర్థిక సంస్థ అధికారి. ఇతని కుమార్తె షణ్మిత (ఒకటిన్నర సంవత్సరం). ఈమె శుక్రవారం రాత్రి తన ఇంటి దగ్గర ఉన్న బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన ఆడుకుంటుంది. అప్పుడు అటుగా వెళ్తున్న ట్రక్కు చిన్నారిని ఢీ కొట్టింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 74,374 మంది స్వామివారిని దర్శించుకోగా 37,477 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.