
శరవేగంగా పాఠశాల భవనాల నిర్మాణం
తిరువళ్లూరు: పట్టణంలో రూ.7.50 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న పాఠశాల నూతన భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో మూడు నెలల్లో పనులను పూర్తి చేసి, విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. తిరువళ్లూరు పట్టణంలోని రాజాజీ వీధిలో మున్సిపల్ హైయ్యర్ సెకండరీ పాఠశాలను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని నిర్ణయించారు. పట్టణంలో ఏళ్ల తరబడి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న రూ.కోట్ల విలువైన 51 సెంట్ల భూమిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని, పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. తరగతి గదులు, ల్యాబ్, గ్రంథాలయం, మరుగుదొడ్లు, రీడింగ్ రూమ్ను నిర్మిస్తున్నారు.