
యాక్షన్ ఎంటర్టైనర్గా ‘ఏస్’
తమిళసినిమా: భిన్నమైన కథను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు విజయ్ సేతుపతి. ఇంతకుముందు ఈయన నటించిన మహారాజా, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఏస్. 7 సీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆర్ముగకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. ఇందులో నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటించగా యోగిబాబు, బబ్లూ పథ్విరాజ్, దివ్యపిళ్లై, అవినాష్ రాజ్కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కరణ్ బి.రావత్ ఛాయాగ్రహణం, జస్టిన్ ప్రభాకర్ సంగీతం, శ్యామ్ సీఎస్ నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇది పూర్తిగా మలేషియాలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం కావడం విశేషం. ఒక సమస్య కారణంగా దుబాయ్ నుంచి మలేషియా చేరుకున్న విజయ్ సేతుపతికి అక్కడే ఉంటున్న యోగి బాబు షెల్టర్ ఇస్తాడు. ఆయన ద్వారా నటి దివ్యపైళ్లె పరిచయం అవుతుంది. అలాగే నటి రుక్మిణి వసంత్ తారస పడుతుంది. ఇక్కడ ముఖ్య అంశం ఏమిటంటే విజయ్ సేతుపతితో పాటు నటి రుక్మిణి వసంత్, దివ్యపిళ్ళై కూడా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక విజయ్ సేతుపతికి సహాయం చేసే ప్రయత్నంలో చిక్కుల్లో ఇరుక్కుటూ ఉంటాడు. అసలు వీరి సమస్యలు ఏమిటి? వాటి నుంచి బయట పడగలిగారా? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం ఏస్. ఇందులో విజయ్ సేతుపతి, యోగిబాబుల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయి. అలాగే బబ్లూ పథ్వీరాజ్ తనదైన శైలిలో విలనిజాన్ని పండించారు. ఇక నటుడు విజయ్ సేతుపతి స్టైలిష్ నటన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, వినోదం, యాక్షన్ అంటూ కమర్షియల్ ఫార్మేట్లో రూపొందిన ఏస్ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపబడుతోంది.