
రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినట్టే
● ముమ్మరంగా రుతుపవనాల విస్తరణ ● నీలగిరి, కోవైకు రెడ్ అలర్ట్ ● పశ్చిమ కనుమల్లో కుండపోత
చైన్నె శివారులలో వాన
కుట్రాలంలో జలకళ
సాక్షి, చైన్నె: ఏటా నైరుతి రుతు పవనాల రూపంలో తమిళనాడుకు వర్షాలు తక్కువే. అయితే పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలో ఈ పవనాల ప్రభావం అధికంగా ఉంటాయి. ఈ పవనాల రూపంలోనే ఇక్కడి జలాశయాలు, వాగులు వంకలు, నదులు పొంగి పొర్లుతుంటాయి. అలాగే, కర్ణాటక నుంచి కావేరి పరవళ్లు తొక్కుతూ డెల్టా వరప్రదాయిని మేట్టూరు జలాశయానికి పుష్కలంగా నీటిని తీసుకొచ్చేలా చేస్తాయి. గత ఏడాది ఈ పవనాల రూపంలో ఆశాజనకంగానే ప్రభావం కనిపించింది. కాగాఈ ఏడాది సాధారణంగానే వర్ష పాతం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది వేసవిలో వచ్చే అగ్ని నక్షత్రం వేళ అకాల వర్షాలు పుష్కలంగా తమిళనాట పలు జిల్లాలలో కురిశాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలో అకాల వర్షం రూపంలో సాధారణంగా 11 సెం.మీ వర్షం పడుతుంది. అయితే, ఈఏడాది 21 సెం.మీ వర్షం పడింది. అదే సమయంలో గతవారం అండమాన్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకడంతో చెదరుముదురు వర్షాలు పడుతూ వచ్చాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం ఓ వైపు ఉంటే, మరో వైపు బంగాళాఖాతంలో ఈనెల 27న అల్పపీడనానికి అవకాశాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో వారం ముందుగానే నైరుతి పవనాలు ప్రవేశించినట్టుగా శనివారం పరిస్థితులు నెలకొన్నాయి.
వారం ముందుగానే..
జూన్ ఒకటి లేదా రెండు తేదీలలో సాధారణంగా నైరుతి రుతు పవనాలు కేరళను తాకుతాయి. ఆ తర్వాత తమిళనాడులోకి విస్తరిస్తాయి. అయితే, 16 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది వారం రోజులకు ముందుగానే కేరళతో పాటూ తమిళనాడులోకి సైతం ఈ పవనాలు ప్రవేశించినట్టు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచే పశ్చిమ కనుమలలో కేరళకు సరిహద్దులో ఉన్న కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. క్రమంగా ఈ పవనాలు రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమల వెంబడి జిల్లాలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, దిండుగల్, కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్ , తిరుప్పూర్ జిల్లాలో వాతావరణం మారింది. ప్రస్తుతం తిరునల్వేలి, తెన్కాశిలో వర్షం పడుతుండగా కోయంబత్తూరు, నీలగిరులలోకి సైతం పవనాలు ప్రవేశించాయి. ఆదివారం, సోమవారం అతిభారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోయంబత్తూరు, నీలగిరులకు రెడ్ అలర్ట్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. గడిచిన 24 గంటలలో నీలగిరి జిల్లా అవలాంజి కొండలలో 11 సెం.మీ, పందలూరులో 11 సెం.మీ, చిన్న కల్లారులోని 9 సె.మీ దేవాలలో 8 సెం.మీ వర్షం పడింది. తిరునల్వేలి జిల్లా ఊత్తు, నాలుముక్కులలో 7 సెం.మీ వర్షం పడింది. ఇక చైన్నె శివారులలోకుండపోతగా వర్షం పడింది. మడిపాక్కం, మేడవాక్కంలో 5 సెం.మీ వర్షం నమోదైందని వాతావరణ శాఖ దక్షిణ రీజియన్ అధికారి అముదా తెలిపారు. నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్టుగా ప్రస్తుతం అధికారికంగా లెకించడం కష్టమేనని, అయితే, పశ్చిమ కనుమలలో విస్తృతంగా వర్షాలుపడుతాయని, కొన్ని చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల అతి భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, కన్యాకుమారిలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి అరటి పంట దెబ్బ తింది. నాగర్ కోయిల్లో ఓ ఉ పాధ్యాయుడి ఇంటిపై సెల్ టవర్ నేల కొరిగింది. అదృష్ట వశాత్తూ ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కులశేఖరంలో చెట్టు కొమ్మలు విరిగి పడడంతో కృష్ణన్(75) మరణించాడు.
చైన్నె శివారులలో వర్షం
కన్యాకుమారి – నైల్లె రహదారిలో వాన
ముందు జాగ్రత్తలు..
కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి, తేని, కోయంబత్తూరు,నీలగిరి జిల్లాలోని జలపాతాలలో నీటి ధార ఇప్పటికే కొంత మేరకు కొనసాగుతోంది. జలాశయాలలో నీటిమట్టం కొంత మేరకు పెరిగి ఉంది. ప్రస్తుతం నైరుతి రుతు పవనాల రాక కారణంగా వర్షాలు పడే అవకాశాలతో ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎస్ మురుగానందం అలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తలు విస్తృతం చేయించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, నదీ తీర పరిసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జలాశయాలలోకి నీటి రాకను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల తీవ్రత మరింతగా పెరిగిన పక్షంలో సహాయక చర్యల కోసం అన్ని విభాగాలతో సమన్వయ కమిటీలను సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినట్టే

రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినట్టే

రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినట్టే