
ఐఐటీఎంలో రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్లు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్లను సోమవారం ప్రకటించింది. ఈ కోర్సులు అత్యాధునిక భవిష్యత్ కార్యక్రమాలుగా మెకానిక్స్ బయోమెడికల్ ఇన్సుట్రుమెంటేషన్లో కోర్ ఇంజినీరింగ్తో పాటూ కంప్యూటేషనల్ ఇంటెలిజెనన్స్ను మిళితం చేసే సిస్టమ్స్ అప్రోచ్ శిక్షణ ద్వారా విద్యార్థులను సమకాలిన సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధం చేయనున్నాయి. దేశంలోనే నంబర్ 1 ర్యాంక్ పొందిన ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) 2025–26 విద్యా సంవత్సరం నుంచి రెండు కొత్త అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభిస్తోంది. 1959లో ఐఐటీ మద్రాస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలో ముందంజలో ఉన్న అప్లైడ్ మెకానిక్స్ , బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఈ కోర్సులు అందించనున్నారు. జేఈఈ (అడ్వాన్స్డ్)లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాబోయే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ( జేఓఎస్ఏఏ) కౌన్సెలింగ్లో ఈ రెండు కొత్త ప్రోగ్రామ్లను ఎంచుకోవచ్చు అని ప్రకటించారు. ఈ కొత్త ప్రోగ్రామ్ గురించి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మార్పులకు గురవుతున్నందున, ఉన్నత విద్యా సంస్థలు విద్యా–పరిశ్రమ అంతరాన్ని తగ్గించడానికి కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం చాలా ముఖ్యం అని వివరించారు. ఈ రెండు కొత్త అత్యాధునిక బి.టెక్ ప్రోగ్రామ్లు పరిశ్రమ 5.ఓ, ఆరోగ్య సాంకేతికత, అధునాతన తయారీ రంగాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తాయని వివరించారు. రెండు ప్రోగ్రామ్లు విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ(ఐడీడీడీ) ప్రోగ్రామ్ల ద్వారా ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ( బీటెక్ ప్లస్ ఎంటెక్)కి అప్గ్రేడ్ అయ్యే అవకాశాన్ని అందిస్తాయని వివరించారు. వీటిలో మూడు – కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ , కాంప్లెక్స్ సిస్టమ్స్, డైనమిక్స్ – అప్లైడ్ మెకానిక్స్ , బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం యొక్క అధ్యాపకుల ద్వారా సమన్వయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల ప్రత్యేక అంశాలను హైలైట్ చేస్తూ, ఐఐటీ మద్రాస్లోని అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సయాన్ గుప్తా మాట్లాడుతూ, ఈ అత్యాధునిక కార్యక్రమాలు సమస్య పరిష్కారానికి బలమైన వ్యవస్థల విధానాన్ని విద్యార్థులకు సన్నద్ధం చేస్తాయన్నారు. కోర్ ఇంజినీరింగ్ సూత్రాలను తాజా సాంకేతిక పురోగతితో మిళితం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు విద్యారంగం, పరిశ్రమ రెండింటిలోనూ సంక్లిష్టమైన వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో నాయకత్వ పాత్రలకు గ్రాడ్యుయేట్లను సిద్ధం చేస్తాయని వివరించారు.