
సైన్యానికి సెల్యూట్
●తిరుచ్చి వేదికగా వేలాది మందితో వీరవందనం ●నేడు చైన్నెలో సంఘీభావ ర్యాలీ ●కశ్మీర్లో సురక్షితంగా తమిళులు ●తమిళనాడుకు తరలింపునకు చర్యలు ●టోల్ఫ్రీ నంబర్ల ఏర్పాటు
ఆర్మీ వీరులకు సంఘీభావం
తెలియజేస్తూ చైన్నెలో శనివారం
బ్రహ్మాండ ర్యాలీకి సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. జమ్ముకశ్మీర్లోని తమిళులు సురక్షితంగా ఉన్నట్టు ప్రకటించారు. అక్కడున్న విద్యార్థులను, తమిళులను సురక్షితంగా తమిళనాడుకు తీసుకొచ్చే చర్యలు చేపట్టారు. ఇందు కోసం టోల్ఫ్రీ నంబర్లను ప్రకటించారు. తిరుచ్చి వేదికగా బహిరంగసభలో ఆర్మీ వీరులకు వేలాది మంది వీర వందనం చేశారు. – సాక్షి, చైన్నె
భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ సైరన్ మోగిన నేపథ్యంలో సరిహద్దుల్లోని రాష్ట్రాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల కారణంగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మరికొన్ని విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుని ఉన్నట్టు సమాచారం. అలాగే, విద్యా పర్యటనకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు కూడా అక్కడ ఉన్నట్టు తెలిసింది. దీంతో వీరిని సురక్షితంగా తమిళనాడుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లకు సీఎం స్టాలిన్ ఆదేశించారు.
రంగంలోకి ప్రత్యేక బృందం
జమ్ముకశ్మీర్తో పాటు పశ్చిమ రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా తమిళులున్నారా అని గుర్తించి వారిని సురక్షితంగా తమిళనాడుకు తీసుకొచ్చేందుకు పుదుక్కోట్టై జిల్లా అదనపు కలెక్టర్ అఫ్తాబ్ రసూల్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఢిల్లీలోని తమిళనాడు భవన్ కమిషనర్ ఆశీష్కుమార్ కశ్మీర్లో ఉన్న తమిళ విద్యార్థులతో సంప్రదింపులు జరిపారు. విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నట్టు తేలింది. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి విమాన సర్వీసులు కూడా రద్దయిన నేపథ్యంలో విద్యార్థులను, అక్కడున్న తమిళులను రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సురక్షితం కాని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు వీలులేని దృష్ట్యా, విమాన సర్వీసులు పునరుద్ధరించగానే, వెంటనే తమిళనాడుకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో విద్యా పర్యటనకు వెళ్లిన నలుగురు విద్యార్థులు రోడ్డు మార్గంలో శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. వీరిని శనివారం చైన్నెకి విమానంలో పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. భారతదేశంలోని పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లోని తమిళుల సమాచారం, సహాయం, రక్షణ, రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చేందుకు వీలుగా న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్లో 24 గంటల హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. 011–24193300 (ల్యాండ్లైన్), 9289516712 (వాట్సాప్ మొబైల్ నంబర్)
సంప్రదించవచ్చని ప్రకటించారు. అలాగే, బాధిత తమిళులకు కుటుంబ సభ్యులు సాయం అవసరమైన పక్షంలో భారతదేశంలో–18003093793, విదేశాలలో +918069009900, +918069 00 9901 నంబర్లను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తమకు అందే సమాచారం మేరకు తమిళులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వీలుగా మైనారిటీ సంక్షేమం, విదేశీ తమిళుల సంక్షేమ మంత్రి ఎస్ఎం.నాజర్, పుదుక్కోట్టై జిల్లా అదనపు కలెక్టర్ అఫ్తాబ్ రసూల్ల బృందం విద్యార్థుల భద్రతకు భరోసా ఇచ్చే విధంగా ముందుకెళుతోంది.
సంఘీభావ ర్యాలీ
సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టే విధంగా భారత సైనికులు దూకుడుగా ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీరోచితంగా పోరాడుతూ పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతున్న భారత ఆర్మీ వీరులకు సంఘీభావం తెలుపుతూ చైన్నెలో శనివారం భారీ ర్యాలీకి సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు మెరీనా తీరంలోని డీజీపీ కార్యాలయం నుంచి ఐల్యాండ్ గ్రౌండ్ సమీపంలోని వార్ మెమోరియల్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. భారత ఆర్మీకి మరింత ఉత్సాహం, మద్దతు ఇచ్చే విధంగా ప్రజలంతా ఐక్యతతో దేశ సమగ్రతా బలాన్ని చాటుకునే విధంగా సంఘీభావ ర్యాలీ జరుగుతుందని, అందరూ తరలిరావాలని సీఎం పిలుపునిచ్చారు. అలాగే, తిరుచ్చి వేదికగా శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆర్మీ వీరులకు సెల్యూట్ అంటూ వేలాది మంది చేత గౌరవ వందనం సమర్పించే విధంగా సీఎం చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో యుద్ద మేఘాల నేపథ్యంలో భారత దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు గౌరవాన్ని కల్పించే విధంగా సెల్యూట్ అని సీఎం ప్రకటించగానే, వేలాది మంది జనం అంతా లేచి నిలబడి గౌరవ వందనం సమర్పించారు. ఉగ్రవాదానికి అంతం..భారత దేశానికే విజయం అనే నినాదాలు ఈసందర్భంగా మార్మోగాయి. అలాగే, మరణించిన సామాన్య ప్రజలకు, ఆర్మీ అమరవీరులకు లేచి నిలబడి నివాళులర్పించారు. ఇదిలాఉండగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు, సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో, ఏదేని ప్రమాదం ఎదురైన పక్షంలో ఎలా ఎదుర్కోవాలి, ఎలా రక్షించుకోవాలో వివరించే విధంగా మాక్డ్రిల్స్ను వేగవంతం చేశారు. తాజాగా ఎన్నూర్ కామరాజర్ హార్బర్, కూడంకులంలోని భారత్, రష్యా అణువిద్యుత్ కేంద్రంలో మాక్డ్రిల్స్ జరిగాయి. ఇదిలాఉండగా పాకిస్తాన్పై భారత్ యుద్ధ నగారా మోగించిన పక్షంలో ఆ దేశం మూడు రోజుల్లో తోక ముడవాల్సిందేనని, ఆ సైన్యం పట్టుమని మూడు రోజులు కూడా భారత సైన్యాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేరంటూ అనేక మంది మాజీ ఆర్మీ అధికారులు యుద్ధం ప్రారంభమైన నేపత్యంలో వ్యాఖ్యలు చేయడం విశేషం.
బాధితులను సురక్షితంగా తరలిస్తూ ప్రదర్శన
మంటలను ఆర్పే విధంగా మాక్డ్రిల్
స్టేడియంకు బాంబు బూచి
చైన్నె ఎంఏ చిదంబరం స్టేడియంకు వచ్చిన బాంబు బూచి అధికారులను , భద్రతా వర్గాలను పరుగులు తీయించింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో చైన్నెలో మ్యాచ్లు జరిగిన పక్షంలో చిదంబరం స్టేడియంను పేల్చేస్తామని వచ్చిన బెదిరింపు కాల్తో కంట్రోల్ రూమ్ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. దీంతో భద్రతా బలగాలు జల్లెడ పట్టాయి. ఆ పరిసరాల్లో నిఘాను పెంచారు. చైన్నెలోని మెరీనా తీరంతో పాటు రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాల్లోనూ భద్రతను ఐదంచెలు పెంచారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి మూడు గంటల ముందే విమానాశ్రయం చేరుకునే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈనెల 12న తన బర్త్డే సందర్భంగా కేడర్ ఎవ్వరూ నేరుగా తనను కలిసేందుకు రావద్దని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి విజ్ఞప్తి చేశారు. తన బర్త్డే సందర్భంగా కేడర్ అంతా ఆలయాల్లో భారత ఆర్మీ కోసం, సైనికుల విరోచిత పోరాటంలో గెలుపు లక్ష్యంగా దేవుళ్లను ప్రార్థించే విధంగా పూజలు చేయాలని పిలుపునిచ్చారు.

సైన్యానికి సెల్యూట్

సైన్యానికి సెల్యూట్