
చైన్నెలో రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్
● 10 వేల సీట్ల ఆఫర్ ● 10,11 తేదీలలో నిర్వహణ
సాక్షి, చైన్నె: విదేశాలలో వైద్య విద్యను అభ్యసించాలన్న కాంక్షతో ఉన్న విద్యార్థుల కోసం చైన్నెలో రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు సన్నాహాలు చేశారు. వివరాలను బుధవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో రష్యన్ ఫెడరేషన్ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్ , చైన్నెలోని రష్యన్ హౌస్ వైస్ కాన్సుల్ – డైరెక్టర్ అలెగ్జాండర్ డోడోనోవ్ , రష్యన్ విశ్వవిద్యాలయాలకు అధీకృత భారతీయ ప్రతినిధి, స్టడీ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవి చంద్రన్ , వోల్గోగ్రాడ్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో అంతర్జాతీయ సంబంధాల విభాగం అధిపతి నటాలియా అల్షుక్లు ప్రకటించారు. అలాగే ఫెయిర్ నిర్వహణకు సంబంధించిన సమగ్ర వివరాలతో బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈఫెయిర్ ద్వారా 10వేల సీట్లను ఇక్కడి విద్యార్థులకు రష్యన్ విద్యా సంస్థలు ఆఫర్ చేయనున్నాయి. రష్యాలో ఎంబీబీఎస్ కోర్సుల ఫీజు సంవత్సరానికి రూ. 3 లక్షల వరకు ఉంటుందని వివరించారు. రష్యాలో మెడిసిన్ చదవడానికి సిద్ధంగా ఉన్న 200 మంది భారతీయ విద్యార్థులకు రష్యన్ విశ్వవిద్యాలయాలు 100 శాతం స్కాలర్షిప్లను అందించనున్నాయని ప్రకటించారు. ఇందు కోసం 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అఖిల భారత రష్యన్ విద్యా ప్రదర్శన మే 10, 11 తేదీలలో చైన్నెలోని రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ సెంటర్ అండ్ కల్చర్ సెంటర్లో జరగనుంది. రష్యన్ ప్రభుత్వానికి చెందిన ఎనిమిది ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలు ప్రత్యక్షంగా పాల్గొనే ఈ ప్రదర్శనలో భారతీయ విద్యార్థులకు 10,000 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంచనున్నారు. గత సంవత్సరం 8 వేల సీట్లు కేటాయించగా, ప్రస్తుతం విదేశాలలో వైద్య విద్య కోసం నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన తాజా నిబంధనలను పూర్తిగా పాటించే విధంగా సీట్ల సంఖ్యను ఈ ఏడాది పెంచారు. మే 13న కోయంబత్తూరులోని ది గ్రాండ్ రీజెంట్లో, మే 14న సేలంలోని జీఆర్టీలో, మే 15న తిరుచ్చిలోని ఫెమినా హోటల్లో, మే 16న మధురైలోని హోటల్ రాయల్ కోర్ట్లోనూ ఫెయిర్కు ఏర్పాట్లు చేశారు. వివరాల కోసం విద్యార్థులు 9282 221 221ను సంప్రదించవచ్చు అని ప్రకటించారు. కాగా, 2025 విద్యా ఉత్సవంలో బయో–టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న, అత్యాధునిక డొమైన్లలో కార్యక్రమాలను అందించే సైన్స్, టెక్నాలజీ , ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా ఈ ప్రదర్శనకు తరలి రానున్నాయి.