
తిరువేర్కాడు మున్సిపాలిటీ కార్యాలయం ముట్టడి
తిరువళ్లూరు: తిరువేర్కాడు మున్సిపాలిటీలో సేకరించే మురుగునీటిని కోలడి గ్రామంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి శుద్ధీకరణ చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ గ్రామస్తులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపంలో కోలడి గ్రామం వుంది. ఇక్కడ 12 వేల మంది జనాభా నివాసం వుంటున్నారు. ఈ క్రమంలో తిరువేర్కాడు మున్సిపాలిటీలో సేకరించే మురుగునీటిని శుద్ధీకరణ చేసి బయటకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే కోలడి గ్రామంలో శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు పనులను ప్రారంభించారు. అయితే తమ గ్రామంలో శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు శుద్ధీకరణకు ఉపయోగించే క్లోరిన్ లాంటి రసాయన పదార్థాలు విడుదలై తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోపిస్తూ కోలడి గ్రామస్తులు తిరువేర్కాడు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. కోలడి గ్రామంలో శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని కోరుతూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు ఆందోళనకారులతో చర్చలు జరిపి వారిని శాంతింప చేశారు. కాగా ఆందోళన సమయంలో ఓ మహిళ స్పృతప్పి పడిపోవడంతో కలకలం రేగింది.