
మురుగన్కు పులి వాహనసేవ
తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో చైత్ర బ్రహ్మోత్సవాలు కోలాహలంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ వేడుకల్లో 6వ రోజైన మంగళవారం సాయంత్రం వళ్లీ, దేవసేన సమేత మురుగన్ పులి వాహనంపై కొలువుదీరారు. అర్చకుల కర్పూర హారతులతో స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. ఉభయదారులు, భక్తజనం హారోంహర నామస్మరణతో ఆలయ మాడ వీధుల్లో స్వామివారు విహరించారు. మంగళ వాయిద్యాలు, నాదస్వరం, చిన్నారులు, మహిళల కోలాటంతో కొండ ఆలయ మాడ వీధుల్లో సందడి నెలకొంది.
పళ్లిపట్టులో గాలీవాన బీభత్సం
పళ్లిపట్టు: పళ్లిపట్టులో మంగళవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటుచేసుకోవడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో రెండు నెలల నుంచి వేసవి ఎండల తీవ్రత విపరీతంగా ఉంది.ఈ క్రమంలో అగ్ని నక్షత్రం తోడు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే అగ్ని నక్షత్రం ప్రారంభమైన తొలిరోజే వర్షం కురవడంతో వేడిమి కాస్తా తగ్గింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో గాలీవాన బీభత్సం సృష్టించి గంటకు పైగా జోరువాన కుమ్మరించింది. దీంతో విద్యుత్ సేవలకు అంతరాయం చోటుచేసుకుంది. పట్టణ ప్రజలతోపాటు శివారు గ్రామాల్లో సైతం విద్యుత్ సేవలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వేసవి ఎండల తీవ్రత తగ్గే విధంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున వేసవి ఎండల తీవ్రత తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.