సిరుచ్చేరిలో సిఫీ డేటా సెంటర్
● రూ. 1,882 కోట్లతో ఏర్పాటు ● ప్రారంభించిన సీఎం స్టాలిన్ ● మంత్రి వర్గం భేటీలో పారిశ్రామిక చర్చ
సాక్షి, చైన్నె: సిరుచ్చేరిలో 1000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తూ రూ.1,882 కోట్లుతో సిఫీ కంపెనీ డేటా సెంటర్ ఏర్పాటైంది. దీనిని గురువారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. చెంగల్పట్టు జిల్లా సిరుచ్చేరి ఐటీ పార్కులో సిఫీ టెక్నాలజీ పార్క్లో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేశారు. వివరాలు.. ఆర్తికంగా వివిధ రంగాలలో, ఉత్పత్తి, ఎగుమతులలో భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం తమిళనాడును తీరిద్చిద్దేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకెళ్తోంది. 2024–25 సంవత్సరానికి 9.69 శాతం వృద్ధిరేటుతో భారతదేశంలో మొదటి స్థానంలో తమిళనాడు ఉండటం గమనార్హం. 2030 నాటికి తమిళనాడులో ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చే దిశగా ముందుకెళ్తున్నారు. ఆ దిశగా సిఫి టెక్నాలజీస్ కంపెనీ, ీసిఫీ టెక్నాలాజీస్, ఇంటీగ్రేటేడ్ ఇంటర్నెట్ సర్విస్ సొల్యూషన్స్, టెలీ కమ్యూనికేషన్ సేవలు, డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు, క్లౌడ్, నెట్వర్క్ సేవలు , భద్రతా పరిష్కారాలతో సహా సెంటర్ను నెలకొల్పింది. సిరుచ్చేరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ వద్ద 40 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ సహా అత్యాధునిక డేటా సెంటర్ ఇన్స్టాల్ చేశారు. తొలి విడతగా రూ. 1,882 కోట్ల ఖర్చుతో 1000 మంది ప్రత్యక్ష ఉపాధి కల్పించే విధంగా తీర్చిదిద్దారు. 2027 నాటికి చైన్నెలో 13,000 కోట్లు పెట్టుబడి పెట్టే దిశగా ఈ సంస్థ కసరత్తులు విస్తృతం చేసింది. ఈ డేటా సెంటర్ను ప్రారంభించిన సీఎం స్టాలిన్ అక్కడి ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీఆర్బి రాజ, ఎంపీ సెల్వం, చెంగల్పట్ట కలెక్టర్ అరుణ్రాజ్, సీఫీ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయకుమార్, కంపెనీ సీనియర్ అధికారులు , ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
మంత్రి వర్గ భేటీ
గురువారం సాయంత్రం సచివాలయంలో మంత్రి వర్గం భేటీ అయింది. సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి మంత్రులు, ఆయా శాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అనేక సంస్థలకు అనుమతులు మంజూరు చేస్తూ కెబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మేరకు కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ప్రభుత్వ పరంగా కొన్ని కీలక అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో వర్సిటీలలో ఖాళీగా ఉన్న వీసీల పదవుల భర్తీకి చర్యలు తీసుకునే విధంగా తీర్మానించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.


