తిరువళ్లూరు: ఎన్నికలకు ఏడాది వ్యవధి మాత్రమే వున్న క్రమంలో బూత్ కమిటీలు, ఐటీ యువజన విభాగాలను క్రియాశీలకం చేసి చురుగ్గా వ్యవహరించాలని తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే కన్వీనర్ రమణ పిలుపునిచ్చారు. తిరువళ్లూరులోని బూత్ కమిటీలతో ప్రత్యేక సమావేశాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఎడపాళ్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సుమిత్ర వెంకటేషన్, మాజీ మంత్రి రమణ హాజరయ్యారు. రమణ మాట్లాడుతూ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే వ్యవధి ఉందన్నారు. ఇప్పటినుంచి బూత్ కమిటీలు, యువజన ఐటీ వింగ్ నేతలు మరింత యాక్టివ్ కావాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాతో ఇంటింటికీ వెళ్లి సరి చూసుకోవాలని, అన్నాడీఎంకే మద్దతుదారులు, న్యూట్రల్ ఓటర్లను పార్టీ నేతలు ఇకపై వారానికి రెండు రోజులు కలవాలని ఆయన సూచించారు. పార్టీ అధికారంలోకి రావడానికి నేతలు కార్యకర్తలు సమన్వయంతో ముందుకుసాగాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కమాండో భాస్కరన్, ఎయిలరసన్, పార్టీ నగర కార్యదర్శి కందస్వామి, మాజీ ప్రభుత్వ న్యాయవాది రామ్కుమార్, పార్టీ నేతలు వెంకటేషన్, బాలాజీ పాల్గొన్నారు.