తిరుత్తణి: డిమాండ్ల పరిష్కారానికి రేషన్ గిడ్డంగి కార్మికులు ఆదివారం ఉదయం వినూత్న నిరసన చేశారు. తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని ఎగువ తిరుత్తణిలో తమిళనాడు రేషన్ గిడ్డంగిలో 50కు పైగా తాత్కాలిక కార్మికులు రేషన్ బస్తాలు దింపడం, రేషన్ దుకాణాలకు వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లి దించే పనులు చేస్తున్నారు. 2007 నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి రోజూవారి పద్ధతిలో కూలి అందజేస్తున్నారు. 7,500 మంది కూలీలు పనిచేస్తుండగా ప్రస్తుతం రాష్ట్రంలోని రేషన్ గిడ్డంగుల్లో 3,500 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, కార్మికుల సంఘం ఎన్నికలు నిర్వహించాలి, ఖాళీలను స్థానికులను నియమించాలనే డిమాండ్ల పరిష్కారానికి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేశారు.ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరరాఘవన్ ఆధ్వర్యంలో 50కు పైగా కార్మికులు నుదిటిపై నామం పెట్టుకుని భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు.