20 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు | - | Sakshi
Sakshi News home page

20 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు

Mar 22 2025 12:30 AM | Updated on Mar 22 2025 12:29 AM

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు నాణ్యతతో కూడిన ల్యాప్‌టాప్‌లు అందించనున్నామని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. ఇందు కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భా గంగా శుక్రవారం ఉదయం స్పీకర్‌ అప్పావు ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 3 వేల రేషన్‌ దు కాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మంత్రి పెరియకరుప్పన్‌ తెలిపారు. అన్ని రేషన్‌ దుకాణాల వద్ద ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తామని మంత్రి చక్రపాణి తెలిపారు. 2,686 ఆరోగ్యకేంద్రా ల్లో పాము, కుక్క కాటుకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని రకాల మందులు పూర్తి స్థాయి లో నిల్వ ఉంచామని ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్‌ తెలిపారు. అన్యాక్రాంతమైన ఆలయ స్థలాలన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఏ ఒక్క స్థలాన్ని వదలుకునే ప్రసక్తే లేదని మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు అనుబంధ బడ్జెట్‌ ను దాఖలు చేశారు. 2024–25 ఏడాదిలో పెట్టిన ఖర్చులు, ఆదాయ వివరాలను ప్రకటించారు.

అదనపు నిధులు..

2024–25లో అనుబంధంగా రూ.19,287 కోట్లతో బడ్జెట్‌ను దాఖలు చేశారు. రెవెన్యూ రూ.12,639 కోట్లు, మూలధనం రూ.6,429, రుణం రూ.218 కోట్లుగా లెక్కలు చూపించారు. కొత్త సేవలు, అందుకు అవసరమైన సాధానాల కొనుగోలుకు నిధుల మంజూరు గురించి ప్రస్తావించారు. ఆహార భద్రత, వినియోగదారుల విభాగానికి రూ.2 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.1,400 కోట్లు, విద్యుత్‌బాకాయిల చెల్లింపునకు రూ.1,036 కోట్లు, రవాణా సంస్థకు రూ.1000 కోట్లు, ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఎదురైన నష్టాన్ని భర్తీ చేయడానికి రూ. 901 కోట్లు కేటాయించినట్టు పద్దులు చూపించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ప్రకట న చేశారు. 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందించనున్నామని ప్రకటించారు. ఇందు కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఒక్కో ల్యాప్‌టాప్‌ రూ.20 వేల విలువతో నాణ్యత తో కూడుకున్నదిగా, విద్యార్థులు మరీ ఉపయోగించుకునేలా కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. నాణ్యత గురించి ఆందోళన వద్దు అని, ముందుగా తమరి లెక్కల గురించి ఓసారి చూసుకోండి అని అన్నాడీఎంకే వర్గాలను ఉద్దేశించి చేసిన లెక్కల పద్దు పెద్ద చర్చకే సభలో దారితీసింది.

లెక్కల చర్చ..

అన్నాడీఎంకే కార్యాచరణను బీజేపీ రూపకల్పన చేస్తున్నట్టుగా మంత్రి తంగం తెన్నరసు ఎద్దేవా చేశారు. తమరి కార్యకర్తల భవిష్యత్తు లెక్కలను ఎక్కడో కూర్చుని(ఢిల్లీ)లో వేసుకుంటున్నారని చాణుక్యతంత్రాలు జరుగుతున్నాయని, తమరి బలాన్ని లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారంటూ చమత్కరించారు. లెక్కల్లో జాగ్రత్తగా ఉండకుంటే భవిష్యత్తు కష్టతరమే అని హెచ్చరించారు. ఇందుకు అన్నాడీఎంకే సభ్యులు ఎదురు దాడికి దిగగా, చివరగా సీఎం స్టాలిన్‌ స్పందిస్తూ, లెక్కల్లో తప్పులుంటే శుభాకాంక్షలు అని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇక, మీడియాతో అన్నాడీఎంకే ప్రధాన కార్య దర్శి పళణిస్వామి మాట్లాడుతూ, తమ లెక్కలు తమకు ఉన్నాయని, ముందుగా వారి కూటమి లెక్కలు తప్పకుండా చూసుకోమనండి అని డీఎంకే ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. లెక్కల్లో తాము పర్ఫెక్ట్‌ అని, వారి లెక్కలు వారు సక్రమంగా చూసుకుంటే మంచిదని హితవు పలికారు.

రూ.2 వేల కోట్ల కేటాయింపు

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి వెల్లడి

అనుబంధ బడ్జెట్‌ దాఖలు

సభలో లెక్కల చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement