● పలుచోట్ల నిరసనలు
సాక్షి, చైన్నె: ఆటోచార్జీల పెంపునకు డిమాండ్ చేస్తూ చైన్నె, శివారు జిల్లాలో బుధవారం 70 శాతం ఆటో సేవలు బంద్ అయ్యాయి. ఆటో కార్మిక సంఘాల నేతృత్వంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు.. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలను ఆటోవాలా పక్కన పెట్టేసి చాలా కాలం అయింది. మళ్లీ యథారాజా తధాప్రజా అన్నట్టుగా తాము నిర్ణయించిందే చార్జీ అని ఆటోవాల వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆటో సంఘాలు కొత్త చార్జీల జాబితాను ప్రకటించాయి. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. దీంతో ఆటో కార్మిక సంఘాలు ఒక రోజు బంద్కు పిలుపు నిచ్చాయి. దీంతో చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలోని ఆటో సంఘాలు ఒక రోజు తమ సేవలను నిలుపుదల చేశాయి. 70 శాతం మేరకుఆ టోల సేవలు ఆగాయి. మరో 30 శాతం ఆటోలు రోడ్డెక్కాయి. అయితే ఆటోల బంద్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అన్నది కలగలేదు. ర్యాపిడో, ఊబర్ వంటి సేవలు కొనసాగడంతో ప్రయాణికులకు రవాణా కష్టాలు ఎదురుకాలేదు. సేవలను నిలుపుదల చేసిన ఆటో కార్మికులు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆటోచార్జీలను త్వరితగతిన నిర్ణయిచాలని, ఆన్లైన్ ప్రైవేటు రవాణా సేవలను నిలుపుదల చేయాలని నినదించారు.