● ఆవిష్కరించిన సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె : తమిళనాడు న్యూస్ పబ్లిక్ రిలేషనన్స్ విభాగం నేతృత్వంలో ఎగ్మూర్ మ్యూజియం ఆవరణలో రూ. 50 లక్షలతో సర్ జాన్ హుబర్డ్ మార్షల్ విగ్రహం ప్రతిష్టించారు. ఆయన జయంతి రోజైన బుధవారం ఈ విగ్రహాన్ని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. సింధు లోయ నాగరికతను వెలుగులోకి తీసుకు రావడంతో పాటూ ద్రావిడ నాగరికత గురించి స్పష్టతను ఇచ్చిన బ్రిటీషు ఇండియా పురావస్తు శాస్త్ర వేత్త సర్ జాన్ హుబర్ట్ మార్షల్కు చైన్నెలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు సీఎం స్టాలిన్ గత ఏడాది జరిగిన సింధులోయ నాగరికత దినోత్సవంలో ప్రకటించారు. దీనిని సాకారం చేస్తూ ప్రస్తుతం ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి ఆవిష్కరించారు. సర్ జాన్ హుబర్ట్ మార్షల్ ఇంగ్లండ్లోని చెస్టర్లో జన్మించారు. 26 ఏళ్ల వయస్సులో ఆయన పురావస్తు పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1924 సెప్టెంబర్ 20వ తేదీన చారిత్రాత్మక సింధు లోయ నాగరికతను ఆయన నేతృత్వంలోని బృందం ప్రపంచానికి చాటి చెప్పింది. సింధు లోయ సంస్కృతికి ద్రావిడ సంస్కృతికి మధ్య దగ్గరి సంబంధాలు ఉన్నట్టు చాటారు. ఈ దృష్ట్యా, ఆయన్ను గౌరవించే విధంగా చైన్నెలోని ఎగ్మోర్ మ్యూజియం ఆవరణలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిని ఆవిష్కరించిన సీఎం స్టాలిన్ ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. సింధు లోయ నాగరికత గురించి మాట్లాడినంత కాలం జాన్ మార్షల్ గురించి మాట్లాడాల్సిందేనని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ద్రావిడ మోడల్ ప్రభుత్వం మరింత గౌరవాన్ని కల్పించిందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తంగం తెన్నరసు, స్వామినాథన్, ఎం. సుబ్రమణియన్, పీకే శేఖర్బాబు, ఎమ్మెల్యేలు పరందామన్, ప్రభాకర్ రాజా, సీఎస్ మురుగానందం, అదనపు కార్యదర్శి ఉదయ చంద్రన్, ప్రభుత్వ అధికారి రాజారామన్, ఐఏఎస్ కవితా రాము తదితరులు పాల్గొన్నారు.