● దాఖలు చేసిన మేయర్ ప్రియ
సాక్షి,చైన్నె: 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ బడ్జెట్ను మేయర్ ప్రియ బుధవారం దాఖలు చేశారు. రిప్పన్ బిల్డింగ్లో బడ్జెట్ దాఖలు నిమిత్తం పాలకమండలి సమావేశమైంది. డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, కమిషనర్ కుమర గురుబరన్ ఈ సమావేశాన్ని పర్యవేక్షించారు. రూ. 5145 కోట్లతో చైన్నెప్రగతిని కాంక్షిస్తూ బడ్జెట్లో నిధులను కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవల విస్తృతం లక్ష్యంగా 3 ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించారు. నగరంలోని 80 వేల వీధులలో రూ. 3 కోట్లతో రేబిస్ టీకాలువేయడం లక్ష్యంగా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ఆస్తి పన్ను వసూళ్లు సులభతరం చేయడానికి కొత్త ఆన్లైన్ సేవలకు చర్యలు తీసుకున్నారు. నగరంలోకి బస్టాప్లను రూ. 30 కోట్లతోఅభివృద్ధి చేయనున్నారు. అలాగే,నగరంలోని నాలుగు బస్టాండ్లను ఆధునీకరించి సేవలను విస్తృతం చేయనున్నారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా రూ.20 కోట్లతో 150 క్రీడా మైదానాలను అన్ని రకాల క్రీడా ఉపకరణలతో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తర చైన్నెలో 2 చోట్ల కొత్త ఇండోర్ వాలీబాల్ స్టేడియం నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు కేటాయించారు. చైన్నె నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశ ద్వారాలు, రోడ్డు జంక్షన్ల వద్ద విద్యుత్ దీపాలతో కూడిన కృతిమ నీటి ఫౌంటేన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. కార్పొరేషన్ సేవలను సులభతరం చేస్తూ, ఫిర్యాదుల స్వీకరణ,పరిష్కారం కోసం ప్రత్యేక వెబ్సైట్, మొబైల్ యాప్ రూపకల్పనకు నిర్ణయించారు. ‘‘చైన్నె కార్పొరేషన్ వార్డుల అభివృద్ధి నిధులను రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెంచారు. మేయర్ అభివద్ధి నిధిని రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లకు పెంచారు. అన్ని శ్మశాన వాటికలకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో జనరేటర్ ఏర్పాటు చేయనున్నారు. వర్షపు నీటి పారుదలపనులకు రూ. 1,032 కోట్లు కేటాయించారు. ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్లలో, కీలక ప్రాంత సుందరీకరణ రూ.42 కోట్లు కేటాయించారు. మనాలి, సాలిగ్రామం, తదితర నాలుగు బస్ టెర్మినల్స్లలో సౌకర్యాలను మెరుగు పరచనున్నారు. చైన్నెలో మూడు దశల్లో ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాగా, బడ్జెట్లో, ఆదాయం రూ.5145.52 కోట్లు ఆదాయ వ్యయం రూ.5214.09 కోట్లుగా చూపించారు.
రూ.5,145 కోట్లతో చైన్నె ప్రగతి బడ్జెట్