సాక్షి, చైన్నె : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్పీకర్ అప్పావు ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించారు. ఈ సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మంత్రి చక్రపాణి మాట్లాడుతూ, ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానం త్వరలో అమలు చేయనున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పరిశీలన జరుగుతోందన్నారు. అలాగే అధికారులు విదేశాలకు వెళ్లనన్నారని, అక్కడి పౌరసరఫరాల పంపిణి వ్యవస్థను అధ్యయనం చేయనున్నారని వివరించారు. మంత్రి సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 2 లక్షల వ్యవసాయ ఉచిత కనెక్షన్లు మంజూరు చేశామని వివరించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి తొలి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. మంత్రి నెహ్రు మాట్లాడుతూ చైన్నె, కోయంబత్తూరు, మదురై, నగరాలలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు పరిశీలన జరుగుతోందని, త్వరలో అమల్లోకి వస్తుందని ప్రకటించారు. చైన్నెలో రూ. 2 వేల కోట్లతో వాటర్ పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి శేఖర్బాబు మాట్లాడుతూ, హిందూ మత దేవాదాయ శాఖ నేతృత్వంలో మరో 10 ఆర్ట్స్ అండ్ సైన్స్కళాశాలలు ఏర్పాటు చేయనున్నామని, తిరుత్తణి ఆలయం కోసం ఏనుగును అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి ఎం.సుబ్రమణియన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అదనంగా ఆరోగ్యకేంద్రాల ఏర్పాటుకు అనుమతి కోరితే కేంద్రం నుంచి ఇంత వరకు స్పందన లేదని అసహనం వ్యక్తంచేశారు.
కుక్కకాటుకు పరిహారం
అసెంబ్లీలో మంత్రి పెరియస్వామి మాట్లాడుతూ, ఇటీవల కాలంగా వీధి కుక్కల స్వైర వివారం గురించి ప్రస్తావించారు. వీధికుక్కుల దాడిలో మేకలు, గొర్రెలు, ఆవులు, గేదులు,కోళ్లు, పెంపుడు జంతువులు చనిపోతున్నట్టు వివరించారు. సీఎం ఎం.కె. స్టాలిన్ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించి సమీక్షించామన్నారు. కుక్కకాటుతో మరణించిన మూగ జీవాలకు విపత్తు నిర్వహణ నిధి నుంచి పరిహారం అందించేందుకు నిర్ణయించామన్నారు. పశువులు మరణిస్తే రూ. 37,500, మేకలు, గొర్రెలకు రూ. 4 వేలు, కోడికి రూ. 100 నష్ట పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు కుక్కల దాడిలో మరణించి 1,149 జంతువులకు పరిహారంగా 42 లక్షలు అందించనుమన్నారు. అదే సమయంలో మేకలు, గొర్రెలకు ఇస్తున్న రూ. 4 వేలు ను రూ. 6 వేలకు, కోడికి ఇస్తున్న రూ.100 నుంచి రూ.200లుగా పెంచుతూ సీఎం స్టాలిన్ ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
సునీత అరుదైన వ్యక్తి..
అనంతరం సభలో సీఎం స్టాలిన్ ప్రత్యేక తీర్మానంతో వ్యోమగామి సునీతా విలియమ్స్తోపాటూ అంతరిరక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన నలుగురు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 287 రోజులు గడిపిన భారతీయ వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ల గురించి గుర్తు చేశారు. సాంకేతిక లోపం కారణంగా, భూమికి తిరిగి రావడం అసాధ్యం కావడంతో అనేక మంది ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందని, ప్రాణాలకు ముప్పు వాటిళ్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అయితే వారు ఆ అంతరిక్ష కేంద్రంలో అవిశ్రాంతంగా శ్రమిస్తూ, తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని తిరిగి భూమి మీదకు రావడం ఆనందకరం అని వ్యాఖ్యానించారు. ఫాల్కన్–9 రాకెట్ , డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్, అక్కడ ఉన్న మరో ఇద్దరు వ్యోమోగామీలు కలిసి ప్రయాణించి ఫ్లోరిడా సమీపంలోని సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ కావడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. భూమికి సురక్షితంగా తిరిగి వచ్చారనే వార్త మనందరినీ చాలా సంతోషంలో ముంచిందన్నారు. ఈ సమయంలో, సునీతా విలియమ్స్, బుచ్ తదితరులను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన వారందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా సభలో సభ్యులు కరతాళ ధ్వనులతో సునీత విలిమ్స్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి , ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి సైతం సునీతా విలిమ్స్ను ప్రశంసించారు. ఎల్లప్పుడూ తమ హృదయాల్లో ఉంటారని వ్యాఖ్యానించారు.