తమిళసినిమా: సంగీతజ్ఞాని ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంగీతానికి ఆయన అందిస్తున్న సేవ ఎనలేనిది. తమిళనాడు, తేని జిల్లాలోని పన్నైపురం అనే మారు మూల గ్రామానికి చెందిన ఇళయరాజా తన సంగీతాన్ని మాత్రమే నమ్ముకుని ఓ హార్మోని పెట్టెను చేత పట్టుకొని చైన్నె మహా నగరానికి చేరుకున్నారు. అలా పలు చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలకు ఎక్కిన మెట్లు ఎక్కకుండా కాళ్లు అరిగేలా తిరిగి 1976లో అన్నకిళి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రం అనుహ్య విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి ఇళయరాజా పాటలు నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి ఇక ఆ తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది. తమిళం తెలుగు హిందీ కన్నడ ఆంగ్లం భాషలో వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా ఎన్నో ఘనమైన అవార్డులను అందుకొని తన కీర్తి పతాకాన్ని ఎగరవేశారు . కాగా గత ఎనిమిదవ తేదీన లండన్లో వలియంట్ సింఫోనిని నిర్వహించి అరుదైన ఘనతను సాధించారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇళయరాజాను స్వయంగా కలిసి అభినందించారు. అంతేకాకుండా త్వరలో ఇళయరాజాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఘనంగా అభినందన సభను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో సంగీత జ్ఞాని ఇళయరాజా మంగళవారం ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆయన నుంచి శుభాకాంక్షలు పొందారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రితో తీసుకున్న ఫొటోలను ఇళయరాజా తన ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో శ్ఙ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతి. నేను సమకూర్చిన సింపోనీ, తదితర విషయాల గురించి నరేంద్ర మోడీ, నేను మాట్లాడకున్నాం. ప్రధానమంత్రి అభినందనలు, ఆదరణకు నేను వినమృడినయ్యా శ్ఙ్రీ అని ఇళయరాజా పేర్కొన్నారు.