సాక్షి, చైన్నె: మాస్కో ఫ్యాషన్ వీక్లో భారతీయ డిజైనర్లు మెరిశారు. మానేజ్ సెంట్రల్ ఎగ్జిబిషన్ హాల్ నాల్గవ మాస్కో ఫ్యాషన్ వీక్ ఈనెల 13వ తేదీ నుంచి మంగళవారం వరకు జరిగాయి. ఇది రష్యన్, అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఇందులో ప్రముఖ డిజైనర్లు, పరిశ్రమ నిపుణులు, అంతర్జాతీయ కొనుగోలుదారులు , ఫ్యాషన్ ప్రియులు, మోడల్స్ ఒక చోట చేరి తమ ప్రతిభను, తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఆలోచనలు, జ్ఞానం ,సృజనాత్మక పరిష్కారాల మీద దృష్టి పెట్టారు. ఇందులో భారతీయ డిజైనర్లు కీలక పాత్రను పోషించే విధంగా మెరిశారు. మాస్కో ఫ్యాషన్ వీక్లో భాగంగా, రష్యన్ , విదేశీ డిజైనర్ల కలెక్షన్లను ప్రదర్శించారు. ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఫ్యాషన్ రంగాన్నిబలోపేతం చేసే విధంగా భారతీయ ఫ్యాషన్లో అత్యుత్తమంగా ఉన్న 400 మందికి పైగా సభ్యులను ప్రోత్సహిస్తూ ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు అద్భుతమైన హస్తకళ సాంప్రదాయ అంశాల ద్వారా భారత దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఎలుగెత్తి చాటారు. ఖాదీ స్థిరత్వం , మన్నికకు ప్రసిద్ధి చెందిన సహజ ఫైబర్ను ఆధునిక ఫ్యాషన్ అంశాలతో కలిపి ఒక ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన రూపాన్ని తీసుకొచ్చారు. ఈకార్యక్రమంలో భారత్తో పాటుగా అర్జెంటీనా, జర్మనీ, మెక్సికో, రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా నుంచి తాజా ఫ్యాషన్ పోకడలను ప్రదర్శించే లఘు చిత్రాలతో సహా నిర్దిష్ట అంశాలపై ఉపన్యాసాలు కూడా సాగాయి. ఈ చిత్రాలను ప్రపంచ ఫ్యాషన్ షార్ట్స్ ఫెస్టివల్లో భాగంగా ఆర్ట్ప్లే డిజైన్ సెంటర్లో ప్రదర్శించారు.
ఫ్యాషన్ వీక్లో మెరిసిన డిజైనర్లు