● 22న చైన్నెలో భేటీకి ఏర్పాట్లు
సాక్షి, చైన్నె: జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వాములయ్యేందుకు 20 పార్టీలు తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల తరపున ఇద్దరు చొప్పున ప్రతినిధులు తమిళనాడుకు రానున్నారు. వీరికోసం గిండిలోని ఓస్టార్ హోటల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాలు.. చైన్నెలో ఈనెల 5వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో లోక్సభ పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. పునర్విభజన పేరిట రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యనుతగ్గించేందుకు కేంద్రంచేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే, నియోజకవర్గ పునర్విభజనతో సమస్యకు గురయ్యే రాష్ట్రాల్లోని పార్టీల ఎంపీలను, ప్రతినిధులను ఈ ఉమ్మడి కార్యాచరణ కమిటీలోకి ఆహ్వానించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేరళముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్మాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు స్టాలిన్ లేఖ రాశారు. అలాగే, ఆయా పార్టీలలోని ముఖ్య నేతలకు సైతం ఇదే లేఖలను పంపించారు. అంతే కాకుండా మంత్రులు, ఎంపీలతో కూడిన బృందాలు ఆయా రాష్ట్రాలకు వెవెళ్లి స్వయంగా నేతలను ఆహ్వానించారు. రాష్ట్రాల పురోగతికి ఆటంకం కలిగించే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. లోక్ సభ నియోజకవర్గ పునర్విభజనకు వ్యతిరేకంగా జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీకి హాజరు కావాలని ఆహ్వానించారు.
20 పార్టీల మద్దతు..
పునర్విభజన పేరిట కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కసరత్తులకు 20 పార్టీలు మద్దతు ప్రకటించి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి తమిళనాడు అధికారులకు ఈమేరకు సమాచారం అందింది. తమ ప్రతినిధులు ఈసమావేశానికి హాజరు అవుతారని కబురు పంపించారు. ఆయా పార్టీల నుంచి ఇద్దరు ఎంపీలు లేదా ముఖ్య ప్రతినిధి చైన్నెకు రానున్నారు. దీంతో ఈనెల 22వ తేదిన జరిగే జేఏసీ భేటీకి వేదికగా గిండిలోని అతిపెద్ద స్టార్ హోటల్ను ఎంపిక చేసి ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. విమానాశ్రయానికి సమీపంలో ఈహోటల్ ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అలాగే, ఆయా పార్టీల నేతలను ఆహ్వానించేందుకు డీఎంకే మంత్రులు, ఎంపీలతో కూడిన కమిటీలను రంగంలోకి దించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయించారు. తమ ప్రతినిధులు జేఏసీ భేటీకి హాజరు అవుతారని ఆయా రాష్ట్రాల నుంచి సీఎం స్టాలిన్కు సమాచారం సైతం చేరడం విశేషం.