వేలూరు: క్రీడలు విద్యార్థినులకు ఉజ్వల భవిష్యత్ను అందిస్తాయని జిల్లా స్పోర్ట్స్ అధికారి బాలమురుగన్ అన్నారు. వేలూరు ధనబాగ్యం క్రిష్ణస్వామి మొదలియార్ మహిళా డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవం, క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం కళాశాల కార్యదర్శి మణినాథన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బాల మురుగన్ మాట్లాడుతూ యుక్త వయస్సులో ఉన్న మీరందరూ విద్యపైనే ద్యేష పెట్టకుండా క్రీడలపైనా ఆసక్తి చూపాలన్నారు. ప్రస్తుతం క్రీడా సర్టిఫికెట్లతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం ఇవ్వడంతో పాటూ వారి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళగలదన్నారు. గతంలో మహిళలు అన్ని రంగాల్లో ఉండే వారు కాదని నేడు అన్ని రంగాల్లోను మహిళలున్నారన్నారు. ఫేస్బుక్, వాట్స్ఆఫ్ల మోజులో పడకుండా విద్యపైనే దృష్టి పెట్టాలన్నారు. ఇక్కడున్న వారు అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో మీ తల్లి దండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారని వారిని ఒక్కసారి గుర్తించుకోవాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలని ఆ లక్ష్యాన్ని అధిగ మించేందుకు పట్టుదలతో ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో చాంపియన్ షిఫ్ సాధించిన విద్యార్థినులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బానుమతి. కళాశాల పిజికల్ ఫిట్నెస్ అధికారి లోకేశ్వరి, విద్యార్థినిలు, ఫ్రొఫెసర్లు పాల్గొన్నారు.