వేలూరు: రేషన్ దుకాణ కార్మికులు పని ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసే విధంగా చూడాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు కలెక్టరేట్లో కో–ఆపరేటివ్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ రేషన్ దుకాణంలో పనిచేసే సేల్స్మన్లు, కార్మికులకు ఆదివారం ఒక్కరోజు శిక్షణ తరగతులు కోఆపరేటివ్ సంఘాల అసిస్టెంట్ డైరెక్టర్ తిరుగుణ అయ్యప్పదురై అధ్యక్షతన జరిగింది. ఈ శిక్షణకు కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణంలో పనిచేసే కార్మికులకు తరచూ ప్రజలతో ఉండడం వల్ల పలు పని ఒత్తిడి ఉండవచ్చునని అన్నారు. అయినప్పటికీ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులకు పని ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. హోమియోపతి డాక్టర్ అరుణ్ విక్రయ దారులకు పని ఒత్తిడి నుంచి తమను ఏ విధంగా కాపాడుకోవాలనే వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం రేషన్ దుకాణాల్లో విశిష్ట సేవలు అందజేసిన సేల్స్మన్లకు, విక్రయ దారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కో–ఆపరేటివ్ విభాగం మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణన్, జిల్లాలోని సేల్స్మన్లు, విక్రయదారులు పాల్గొన్నారు.