వేలూరు: జైలు నుంచి విడుదలైన ఖైదీలను చిన్న చూపు చూడకుండా వారిని సమాజంలో ఒకరిగా చూడాలని వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ధర్మరాజ్ అన్నారు. వేలూరు సెంట్రల్, మహిళా సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన ఖైదీలకు మాజీ జైలు ఖైదీల పునరావాస సంఘం, వెటర్నరీ శాఖ, జైళ్ల శాఖ సంయుక్తంగా కోళ్ల పెంపకంపై శిక్షణ తరగతులు జైలు ఆవరణలో జరిగాయి. ఆయన మాట్లాడుతూ క్షణికావేశంతో చేసిన తప్పులకు వీరందరూ జైలు శిక్ష అనుభవించి చేసిన తప్పును తెలుసుకొని వారి జీవితంలో మార్పురావడంతోనే జైలు నుంచి విడుదల చేశారన్నారు. అయితే ఈ సమాజం జైలు శిక్ష అనుభవించిన వారిని చిన్నచూపు చూడకుండా సమాజంలో ఒకరిగా చూడాలన్నారు. మాజీ ఖైదీలు ఇకపై చెడు అలవాట్లకు బానిస కాకుండా స్వయం ఉపాధిని ఎంచుకొని వాటి ద్వారా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం సాయం చేసేందకు సిద్ధంగా ఉందన్నారు. అందుకే ప్రస్తుతం కోళ్ల పెంపకంపై శిక్షణ ఇచ్చి వారికి అవసరమైన కోల్లను కొనుగోలు చేసి ఇచ్చి వాటిని పెంచుకొని వాటి ద్వారా వచ్చే ఆదాయంతో చెడు అలవాట్లకు వెళ్లకుండా కుటుంబాన్ని పోషించుకోవాలన్నారు. జైలు ఖైదీల పునరావాసుల సంఘం కార్యదర్శి జనార్దన్, సీనియర్ న్యాయవాది విజయరాఘవులు, కోశాధికారి శ్రీనివాసన్, సభ్యులు శరవణన్, వెటర్నరీ విభాగం ప్రొఫెసర్ పాండియన్ పాల్గొన్నారు.