● ఏర్పాట్లలో విజయ్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రికళగం తొలి సర్వ సభ్య సమావేశం నిర్వహణకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సిద్ధమయ్యారు. ఈనెల 28న తిరువాన్మియూరులో సమావేశానికి కసరత్తులు చేపట్టారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్తున్న విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించి పార్టీపరంగా 121 జిల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు 95 జిల్లాలకు కార్యదర్శులు, ఇతర కమిటీ సభ్యులను ప్రకటించారు. గురువారం మరో 19 జిల్లాల కార్యదర్శులను నియమించారు. ఇంకా ఏడు జిల్లాలకు మాత్రమే కమిటీని ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ప్రజల్లోకి వెళ్లే విధంగా తీర్మానాలు, హామీలను ప్రకటించేందుకు విజయ్ కసరత్తులు చేశారు. ఇందులో భాగంగా ఈనెల 28న సర్వసభ్య సమావేశ నిర్వహణకు ఆయన యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో జిల్లాల కమిటీలు, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో రాష్ట్ర కమిటీకి సంబంధించి పూర్తి పదవుల భర్తీ ప్రక్రియ ముగియనున్నట్టు చెబుతున్నారు. ఈప్రక్రియ తర్వాత సర్వ సభ్య సమావేశాన్ని సమావేశపరిచి ఏప్రిల్ రెండు లేదా మూడో వారం నుంచి ప్రజల్లోకి వెళ్లే విధంగా విజయ్ ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంటున్నారు.