కొరుక్కుపేట: బతుకుదెరువు కోసం ఎన్ని భాషలనైనా నేర్చుకోండి కానీ, మాతృభాషను మాత్రం మరువొద్దని అఖిల భారత తెలుగు సమాఖ్య, ఎస్కేడీటీ పాఠశాలల అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. చైన్నె విల్లివాకంలోని శ్రీ కనకదుర్గ తెలుగు ప్రాథమిక పాఠశాల 78వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఇందులో పాల్గొన్న సీఎంకే రెడ్డి మాట్లాడుతూ విద్యతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోను విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. మాతృభాషను మరువొద్దని విద్యార్థులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఉద్యోగ విరమణ పొందనున్న శ్యామలకుమారిని ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డుతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు లయన్ జనక కోటయ్య బహుమతులను ప్రదానం చేశారు. మద్రాసు వర్సిటీ తెలుగుశాఖ అధ్యక్షుడు విస్తాలి శంకరరావు, ఐకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శోభారాజా, హెచ్ఎం రేణుక, సీఎం కిషోర్, పోరూరు శ్రీనివాసరావు, ఎన్. నర సింహులు, శేషగిరిరావు, పీవీహెచ్ కామేశ్వరరావు, హెచ్ఎం మోహన్నాయుడు పాల్గొన్నారు.