తల్లి నటించిన చిత్ర సీక్వెల్లో తనయ
తమిళసినిమా: అనూహ్య ఘటనలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిదే త్వరలో జరగబోతోంది. దీని గురించి ఇంత నమ్మకంగా చెప్పడానికి కారణం స్పష్టమైన ప్రకటన రావడమే. ఇకపోతే దివంగత అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరనడం అతిశయోక్తి కాదు. పుట్టుకుతోనే పువ్వు వికసిస్తుందంటారు. అలా బాలతారగానే భళా అనిపించుకున్న శ్రీదేవి కథానాయకిగానూ ఇండియన్ సినిమాకు తనదైన అందమైన నటనను అందించి ప్రేక్షకులను పరవశింపజేశారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో నటించి ఎవర్గ్రీన్ హీరోయిన్గా వెలిగారు. అలా శ్వాస ఉన్నంత వరకూ నటిగా కళామతల్లికి సేవలందించిన అద్భుత నటి శ్రీదేవి. బాలీవుడ్ చిత్ర నిర్మాత బోనీకపూర్ను పెళ్లి చేసుకున్న ఈమె ఇద్దరు రత్నాలాంటి కూతుర్లను సినీ కళామతల్లికి అందించారు. వారిలో నటి జాన్వీకపూర్ ఇప్పటికే హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ విజయపథంలో సాగుతున్నారు. రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా హిందీ చిత్రాల్లో గత రెండేళ్లుగా కథానాయకిగా నటిస్తున్నారు. కాగా వీరిద్దరూ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాల్లోనూ చాలా యాక్టివ్గా ఉంటారు. నటి జాన్వీకపూర్ ప్రస్తుతం తెలుగులో రామ్చరణ్కు జంటగా నటిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. కాగా రెండో కూతురు ఖుషీ కపూర్ తన తల్లి శ్రీదేవి కథానాయకిగా నటించిన మామ్ చిత్రానికి సీక్వెల్ నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్నే స్వయంగా పేర్కొన్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన చెబుతూ 2017లో తన భార్య,నటి శ్రీదేవి కథానాయకిగా నటించిన మామ్ చిత్రానికి సీక్వెల్ను రూపొందించనున్నట్లు చెప్పారు. అందులో తన రెండవ కూతురు ఖుషీ కపూర్ ముఖ్య పాత్రలో నటించనున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మామ్ చిత్రానికి సీక్వెల్ అంటే ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు
నటి
ఖుషీ కపూర్
నూతన చిత్ర ప్రారంభోత్సవంలో నటుడు శశికుమార్, భరత్తో యూనిట్ సభ్యులు
తమిళసినిమా: వైవిధ్యభరిత కథా చిత్రాల హీరోగా పేరు గాంచిన నటుడు శశికుమార్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటుడు సత్యరాజ్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో నటి మెఘాశెట్టి, మాళవిక నాయకిలుగా పరిచయం అవుతున్నారు. వీరితో పాటూ ఎంఎస్.భాస్కర్, ఆడుగళం నరేన్, శరవణన్, గంజాకరుప్పు, ఇందుమతి, జోమల్లేరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఎం.గురు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఆర్.శరవణన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. జంబారా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై ధర్మరాజ్ వేలుసామి, విజయకుమార్తో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్ఆర్.సతీశ్కుమార్ ఛాయాగ్రహణంను, ఎన్ఆర్.రఘునందన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్వకుడు తెలుపుతూ ఒక బలమైన కథా,కథనాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదనీ,కుటుంబ అనుబంధాలు, బావోద్రేకాలతో జరరంజకంగా చిత్రం ఉంటుందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ను పట్టుకోట్టై, మన్నార్కుడి , పుదుకోట్టై, తంజావూర్, వేదారణ్యం పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయడానికి ప్రణాళికను రచించినట్లు చెప్పారు.
తమిళసినిమా: ఎస్పీకే.పిక్చర్స్ పతాకంపై ప్రభాకరన్ స్టాండ్ ఎలోన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి నిర్మించిన చిత్రం మర్మర్. హేమనాథ్ నారాయణన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో రిచ్చీకపూర్, దేవరాజ్ ఆర్ముగం, నటి సుకన్య షణ్ముగం, యూవీకా రాజేంద్రన్,ఆరియా సెల్వరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో ఫస్ట్ పౌండ్ ఫుటేజ్ హార్రర్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై సక్సెస్పుల్గా ప్రదర్శింపబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ బుధవారం ఉదయం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వేదికపై నిర్మాత ప్రభాకరన్ మాట్లాడుతూ మర్మర్ చిత్ర విజయం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ చిత్రం కోసం అందరు చాలా శ్రమించారన్నారు. దర్శకుడు హేమనాథ్ నారాయణన్ కొత్త ట్రెండింగ్ కథతో దీన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారన్నారు. మర్మర్ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసిన ఎస్ఆర్ పిక్చర్స్ సంస్థకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. కొత్తవారు చేసిన పని ముందుగా చేదుగా ఉంటుందని, ఆ తరువాత మధురంగానూ, ఆపై అంతా వ్యాపిస్తుందని, అలానే కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త నటీనటులు, సాంకేతిక వర్గం పని చేసిన మర్మర్ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తుందని తాను చెప్పడం కాదని, డిస్ట్రిబ్యూటర్ చెబుతున్నారని అన్నారు. తాను ఎస్పీకే సంస్థను ప్రారంభించి 12 ఏళ్లు అవుతుందని, ఇప్పటి వరకూ తన యూనిట్ సభ్యులు ఆదివారాల్లో గానీ, రెండవ శనివారాల్లోగాని పని చేయలేదని, అలాంటిది ఈ చిత్రం కోసం గత ఐదారు రోజులుగా రేయింబవళ్లు పని చేశారని, వారే తన బలం అని నిర్మాత ప్రభాకరన్ పేర్కొన్నారు. మర్మర్ చిత్రానికి మరింత విజయాన్ని చేకూర్చాలని, అప్పుడు మరిన్ని చిత్రాలు రూపొందే అవకాశం ఉంటుందని చిత్ర దర్శకుడు హేమంత్ నారాయణన్ పేర్కొన్నారు
బ్లాక్బస్టర్ దిశగా మర్మర్