తిరువళ్లూరు: పట్టణంలో మంగళవారం పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా గత పది రోజుల నుంచి ఎండల దంచికొడుకున్నాయి. ఉక్కపోత, భారీగా ఎండల తీవ్రత పెరిగిన క్రమంలో మంగళవారం నుంచి జిల్లాలోని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సాయంత్రం భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రోడ్లు జలమయంగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో సీఎం బహిరంగసభ కోసం పట్టణంలో ఏర్పాటు చేసిన సీఎం, డిప్యూటీ సీఎంల కటౌట్లు కూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. గత కొద్ది రోజులుగా ఉక్కపోత ఎండతో ఇబ్బంది పడుతున్న జనానికి మంగళవారం కురిసిన భారీ వర్షానికి వాతావరణం చల్లబడి కాస్తా ఊరటనిచ్చింది.