
రోడ్డు విస్తరణ పేరిట చెట్ల తొలగింపు
తిరువళ్లూరు: రోడ్లు విస్తరణ పేరిట ఇరువైపులా ఉన్న చెట్లను అటవీశాఖ అనుమతి లేకుండా నరికివేస్తున్న రోడ్లు భవనాల శాఖ అధికారుల వ్యవహారంపై పలు స్వచ్ఛంద సంఘాలతోపాటు గ్రీనరీ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరువళ్లూరు జిల్లా ఆవడి కోవిల్పథాకై లోని కలైంజనగర్ సమీపంలో ట్రాపిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డుకు ఇరువైపులా భారీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ వర్షపు నీరు వెళ్లడానికి కాలువలు నిర్మించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇరువైపులా వున్న భారీ చెట్లను గత రెండు రోజుల నుంచి నరికివేస్తున్నారు. అయితే చెట్లు నరకాలంటే అటవీశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఈ క్రమంలో చెట్లు తొలగింపుపై సర్వత్ర విమర్శలు ఎక్కువవుతున్నాయి. రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాలు, దుకాణాలను తొలగించకుండా చెట్లును తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై రోడ్లు శాఖ అధికారి రామచంద్రన్ను వివరణ కోరగా రోడ్లు విస్తరణ, కాలువల నిర్మాణల కోసమే చెట్లు నరికివేస్తున్నామని, అందుకు అవసరమైన అన్ని అనుమతులను తిరువళ్లూరు జిల్లా అటవీశాఖ అధికారుల నుంచి పొందినట్టు వివరించారు. అయితే తిరువళ్లూరు జిల్లా అటవీశాఖ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా సమాధానమిచ్చారు. చెట్లు తొలగింపునకు తమ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు పొందలేదని స్పష్టం చేశారు. చెట్లు తొలగింపు వ్యవహారంపై తాము కఠినంగా ఉంటామని, నరికివేస్తున్న వారిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. చెట్లు నరికివేతపై పుళల్ చెరువు, అరాఫత్ చెరువు పరిరక్షణ కమిటీలు, గ్రీనరీ మిషన్లు కలెక్టర్తో సహా పలువురు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి.