తుంగతుర్తి : కీటక జనిత వ్యాధులపై వైద్య సిబ్బంది నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి జి. ప్రసిద్ధి సూచించారు. మంగళవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం, రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామాలు, పట్టణాల్లో దోమల నివారణకు ఏసీఎం పిచికారీ చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కుష్టు, టీబీ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఏఎంఓ మోతీలాల్, వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి, వైద్య సిబ్బంది ఉన్నారు.
మట్టపల్లిలో పరమపదోత్సవం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుకల్యాణోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో మంగళవారం పరమపదోత్సవ పూజలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనాది మహర్షులకు, సకలదేవతలకు, ఆళ్వారాలకు అర్చనలతో పాటు మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశి ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, అనంతాచార్యులు, నరసింహా చార్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జనగణన వివరాలు
పక్కాగా సేకరించాలి
తిరుమలగిరి(తుంగతుర్తి) : జన గణన 2027 వివరాలు పకడ్బందీగా సేకరించాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు అన్నారు. మంగళవారం అనంతారం మోడల్ స్కూల్లో జన గణన శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీఎస్ఓ కిషన్, ఫీల్డ్ ట్రైనర్లు అశోక్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ నరేందర్, ఆర్ఐ సుజిత్రెడ్డి పాల్గొన్నారు.
హక్కుల సాధనకు ఉద్యమించాలి
హుజూర్నగర్ : హక్కుల సాధనకు కార్మిక సంఘాలు ఏకమై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హుజూర్నగర్లోని సీపీఐ కార్యాలయంలో ఇందిరాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి చట్టం చేసిందని తెలిపారు. కార్మిక సంఘాలు ఏకమై మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలని అన్నారు. మేడే ఉత్సవాలను వాడవాడన ఘనంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టి ప్రసాద్, నాయకులు దగ్గుబాటి సత్యానందం, బెల్లంకొండ రామ్మూర్తి, రామిశెట్టి సుబ్బారావు, పంకజ్, రమేష్, శివ, జక్కుల రమణ పాల్గొన్నారు.


