సూర్యాపేటటౌన్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 2న నల్లగొండ పట్టణంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జాబ్మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన యువతకు మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి కల్పించేందుకు ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 50కి పైగా కంపెనీల వారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొనే వారు https://satg.telangana. gov.in/prajapalana/ వెబ్ సైట్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల అధికారి సెల్ : 9100949979 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.


