
పారిశుద్ధ్యం ఎలా..
గ్రామ పంచాయతీలకు నిధులు కరువు
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025
ఫ వానాకాలంలో పారిశుద్ధ్య
నిర్వహణ విషయంలో అయోమయం
ఫ ఏడాదిన్నరగా పెండింగ్లోనే బిల్లులు
ఫ ఎన్నికలు జరిగి సర్పంచ్లొస్తే
తగ్గనున్న భారం
ఫ మరో మూడునెలల వరకు కార్యదర్శులదే బాధ్యత
భానుపురి (సూర్యాపేట) : వానాకాలంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు పంచాయతీ కార్యదర్శులు పెద్ద ఎత్తున ఖర్చు చేయగా.. నిధులు రాలేదు. ప్రస్తుత వానాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు మళ్లీ నిధులు అవసరం పడతాయి. ఈ నిధులు ఎక్కడినుంచి తేవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారు 2కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికలు జూలైలోనే ఉండే అవకాశముందని ప్రచారం జరగ్గా.. అధికారులు, కార్యదర్శులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే సెప్టెంబర్ వరకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమయం కోరడంతో తప్పనిసరిగా కార్యదర్శులే ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది.
నిధులు లేక..
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు వరుణుడి జాడ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. వర్షాలు పడి ముసురు పెడితే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. వీధులన్నీ చిత్తడిగా మారడం, చెత్తాచెదారంతో దోమలు వ్యాపించి అంటువ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ క్రమంలో పంచాయతీలు పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణకు ఆయిల్ బాల్స్, ఫాగింగ్ మందు, మురుగు కాల్వల్లో పూడికతీత, ట్రాక్టర్ మెయింటెనెన్స్, పైప్లైన్ల లీకేజీలకు మరమ్మతులు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం వానాకాలం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించినా.. ఎలాంటి నిధులు కేటాయించలేదు. పంచాయతీ కార్యదర్శులు దుకాణదారుల వద్ద అప్పు తేవాలన్నా.. గతంలో తీసుకొచ్చిన వాటికి బిల్లులు మంజూరు కాకపోవడంతో మళ్లీ ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది.
న్యూస్రీల్
పెండింగ్లో ఉన్న
బిల్లులు సుమారు
రూ.2కోట్లు
మొత్తం గ్రామ
పంచాయతీలు 475
ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలన
పారిశుద్ధ్య నిర్వహణకు కావాల్సిన నిధులు ప్రస్తుతం పంచాయతీల వద్ద లేవు. ఏడాదిన్నరగా సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనలో ఇంతవరకూ ఒక్క బిల్లు మంజూరు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే జూన్ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇచ్చి జూలై, ఆగస్టులో స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తవుతాయన్న ప్రచారం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా మంత్రుల నుంచి ఈ మేరకు పలుమార్లు ప్రకటనలు రావడంతో పంచాయతీ కార్యదర్శులు తమ భారం తగ్గతుందని ఆశపడ్డారు. కానీ సెప్టెంబర్ నాటికి ఎన్నికలు పూర్తయ్యే అవకాశముండడంతో వర్షాలు పడే ఈ మూడునెలలు ఎలా వెళ్లదీయాలోనని మదనపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఒక్కో చిన్న పంచాయతీకి రూ.7లక్షల నుంచి రూ.8 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. పంచాయతీలు వసూలు చేసే ఇంటి, నల్లా బిల్లులు సైతం ఏడాదిగా డ్రా చేసుకునే వీలు లేకుండా ఫ్రీజింగ్ చేశారు. దీంతో నిధుల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నారు.