
వీడిన ఉత్కంఠ
సూర్యాపేట : స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ తొలగింది. నేడోరేపో నోటిఫికేషన్ వస్తుందని కొందరు, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ ఉండకపోవచ్చని మరికొందరు ప్రచారం చేస్తుండగా.. మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి కానున్నా యి. జిల్లాలో 486 గ్రామపంచాయతీలు, 213 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత రాగా.. రాజకీయ పార్టీలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ ఇక రిజర్వేషన్లపై చర్చ మొదలైంది.
ముందుగా సర్పంచ్ ఎన్నికలేనా..?
జిల్లా వ్యాప్తంగా గతంలో 475గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 11పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో మొత్తం 486 గ్రామపంచాయతీలు అయ్యాయి. అయితే గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. తర్వాత జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసింది. తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిరకాల నిధులు నిలిచిపోయాయి. దీంతో ముందుగా ఈ ఎన్నికలే నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెంటనే అదే గుర్తులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సైతం 20రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తారని సమాచారం.
ఆశావహుల్లో ఉత్సాహం
రాజకీయ పార్టీల్లో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలతో రాజకీయ పార్టీలు, ఆశావహులు పోటీకి సై అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయన్న ఆతృతతో ఎదురు చూస్తున్న ఆశావహులకు హైకోర్టు తీర్పు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతోపాటు, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే రిజర్వేషనన్ ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న ప్రధాన చర్చ జిల్లాలో ఇప్పుడు మొదలైంది. బీసీలకు 42శాతం రిజర్వేషనన్ అమలు అవుతుందా..? లేదంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది తేలాల్సి ఉంది. ఇదే ఉత్కంఠ ప్రస్తుతం రాజకీయ పార్టీలు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల్లో నెలకొంది. అయితే పార్టీలే తాము ఇచ్చే టికెట్లలో 42 శాతం బీసీలకు ఇచ్చే ప్రతిపాదన కూడా వస్తోంది.
ఫ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పల్లెల్లో సందడి
ఫ సెప్టెంబర్ 30లోపు
నిర్వహించాలని ఆదేశం
ఫ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చ
ఫ సన్నద్ధమవుతున్న ఆశావహులు