
రెండు రోజులు అలర్్ట!
ఇప్పటికే 43 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయయి. ఎండల తీవ్రత పెరగడంతోపాటు.. వచ్చే రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
మార్చిలోనే మొదలైన ఎండలు
ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చిలోనే మొదలైన ఎండలు ఏప్రిల్ చివరి నాటికి అధికమయ్యాయి. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని, అయితే ఆది, సోమవారం తర్వాత ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు
ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే టోపీ ధరించడం, తలకు తువాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, నీడ ప్రదేశాల్లో మాత్రమే ఉండాలని, ఎక్కువ మోతాదులో మంచినీరు, మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పారు. ఉపాధి కూలీలు ఉదయం వేళల్లో పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పని ప్రదేశంలో షామియానాలు ఏర్పాటు చేసుకోవాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు.
రానున్న రెండు రోజులు మరింత
పెరగనున్న ఎండల తీవ్రత
ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా కురుస్తాయంటున్న వాతావరణ శాఖ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న కలెక్టర్
మండలం గ్రామం ఉష్ణోగ్రత
దామరచర్ల దామరచర్ల 43.8
మాడుగులపల్లి మాడుగులపల్లి 43.7
దామరచర్ల తిమ్మాపూర్ 43.6
మిర్యాలగూడ టేక్యాతండా 43.4
త్రిపురారం మాటూరు 43.3
అడవిదేవులపల్లి ముల్కచర్ల 43.2
నార్కట్పల్లి నార్కట్పల్లి 43
తిరుమలగిరిసాగర్ తిరుమలగిరిసాగర్ 43
మోతె మామిళ్లగూడెం 43.1
అప్రమత్తంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలి. వడదెబ్బ తగిలిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని ఆదేశించాం. చిన్నారులు, వయోవృద్ధులు ఎండకు బయటకు వెళ్లవద్దు. ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించి చికిత్స పొందాలి.
– కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్

రెండు రోజులు అలర్్ట!

రెండు రోజులు అలర్్ట!