
ధాన్యం కొనాలని రైతుల ధర్నా
తాళ్లగడ్డ (సూర్యాపేట): సూర్యాపేట మండల పరిధిలోని రాజ్నాయక్ తండాలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం సూర్యాపేట–జనగామ రోడ్డుపై ధర్నాకు దిగారు. లారీలు రావట్లేదనే సాకుతో కాంటాలు నిలిపివేశారని, ఐదు రోజులకు ఒక లారీ చొప్పున కాంటాలు వేస్తే మేము ఇలా ఎన్ని రోజులు కేంద్రంలోనే నిరీక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి కాంటాలు వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రోడ్డుపై ధర్నా చేయడంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇతర వాహనదారులు పక్కనే మడికట్ల నుంచి వెళ్లాల్సి వచ్చింది.